ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్న శ్రీకాంత్ రెడ్డి
19 Aug, 2013 11:07 IST
కడప 19 ఆగస్టు 2013:
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలనే ఏకైక డిమాండ్తో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తాను చేపట్టిన దీక్ష రిమ్సు ఆస్పత్రిలో కొనసాగిస్తున్నారు. మాజీ మేయర్ రవీంద్రనాథరెడ్డితో పాటు హఫీజుల్లా, పాండురంగారెడ్డి, సంపత్ కలెక్టరేట్ ఎదుట గత ఏడు రోజులుగా నిరవధిక దీక్షలో ఉన్న విషయం తెలిసిందే. వారి దీక్షను పోలీసులు ఆదివారం రాత్రి భగ్నం చేశారు. దీక్షాధారులను రిమ్సు ఆస్పత్రికి తరలించారు. వైద్యానికి నిరాకరిస్తూ దీక్షలు కొనసాగిస్తున్నారు. మరోవైపు వైయస్ఆర్ కాంగ్రెస్ నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా సోమవారం కడప, రాయచోటి పట్టణాలలో బంద్ నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే శ్రీనివాసులు, అమర్నాథ్ రెడ్డి చేపట్టిన నిరాహార దీక్షలు సోమవారానికి అయిదో రోజుకు చేరుకున్నాయి.