హైదరాబాద్ : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై బురదచల్లేందుకే సీఎం కిరణ్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పరిమితం అవుతున్నారని వైయస్ఆర్సీఎల్పీ ఉపనాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి ధ్వజమెత్తారు. తమపై బురద జల్లే బదులు విభజన ప్రక్రియను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే మంచిదని ఆమె వారికి హితవు పలికారు. రాష్ట్ర విభజనకు కిరణ్కుమార్రెడ్డి సహకరిస్తున్నారని.. అసెంబ్లీలో బొమ్మలా కూర్చుని చంద్రబాబు ఆ ప్రక్రియకు వంత పాడుతున్నారని ఆమె విమర్శించారు. సహచర పార్టీ ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, మేకతోటి సుచరితలతో కలిసి అసెంబ్లీ మీడియా పాయింట్లో శోభా నాగిరెడ్డి శనివారం మాట్లాడారు.
సమైక్య తీర్మానం చేసేందుకు కాంగ్రెస్, టీడీపీలు ఎందుకు ముందుకు రావడం లేదని శోభా నాగిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. సమైక్యాంధ్రప్రదేశ్ గురించి ఆలోచించే బదులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించేందుకే ఆ రెండు పార్టీల నేతలు సమయాన్నంతా వినియోగిస్తున్నాయని విమర్శించారు.
టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు శోభా నాగిరెడ్డి ఈ సందర్భంగా పలు ప్రశ్నలను సంధించారు.
- పార్టీ వైఖరేమిటో చెప్పకుండా చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉంటున్నారు?
- తెలంగాణకు అనుకూండా టీడీపీ ఉందంటూ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్రెడ్డి మాట్లాడిన దానికే ఆ పార్టీ కట్టుబడి ఉందా?
- సమైక్యవాదులం అని చెప్పుకుంటున్న కొందరు మంత్రులు రాష్ట్రాన్ని విభజిస్తున్నట్లు సీడబ్ల్యూసీ తీర్మానం చేసిన సమయంలో పదవులకు ఎందుకు రాజీనామా చేయలేదు?
- దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి వల్లే కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం మరిచారా?
- విభజనబిల్లుపై అసెంబ్లీలో జరుగుతున్న చర్చలో పాల్గొనాలంటూ మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నవారు మేము పాల్గొంటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారనే హామీ ఇవ్వగలరా? బిల్లుపై ఓటింగ్ ఉంటుందని సీఎం, స్పీకర్ హామీ ఇవ్వగలరా?