విజయమ్మ 'సమరదీక్ష' చరిత్రాత్మకం

21 Aug, 2013 10:19 IST
ఒంగోలు :

రాష్ట్రంలోని ఇరు ప్రాంతాలకూ సమన్యాయం చేయాలంటూ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ‌ చేస్తున్న దీక్ష చరిత్రాత్మకమని పార్టీ కనిగిరి నియోజకవర్గం సమన్వయకర్త కాటం అరుణమ్మ అభివర్ణించారు. శ్రీమతి విజయమ్మ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు మంగళవారం ఉదయం ఒంగోలు మినీ స్టేడియం నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి గుంటూరు వెళ్లారు. ఈ సందర్భంగా 150కిపైగా వాహనాలతో కూడిన ర్యాలీని అరుణమ్మ ప్రారంభించి, మాట్లాడారు. జైలులో ఉన్నప్పటికీ తెలుగు జాతి కోసం తపనపడుతున్న వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్‌రెడ్డిని కన్న శ్రీమతి విజయమ్మ జీవితం ధన్యం అన్నారు. జాతి ఐక్యత కోసం శ్రీమతి విజయమ్మ, శ్రీ జగన్, పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడం గర్వించదగిన విషయం అని పేర్కొన్నారు.

సమరదీక్షతో శ్రీమతి విజయమ్మ తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అరుణమ్మ అన్నారు. శ్రీమతి విజయమ్మ దీక్ష స్ఫూర్తితో ప్రతి పల్లె ఉద్యమంలో పాల్గొనాలని, అప్పుడే ఢిల్లీ పీఠం కదిలి వచ్చి రాష్ట్ర విభజన ప్రకటనను ఉపసంహరించుకుంటుందని తెలిపారు. ఉద్యమానికి మహిళలు స్వచ్ఛందంగా మద్దతు తెలపాలని కోరారు. పార్టీ‌ ఒంగోలు నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్ మాట్లాడుతూ రాహు‌ల్‌ను ప్రధానిని చేసేందుకే రాష్ట్ర విభజనకు సోనియా కుట్ర చేశారని అన్నారు. జాతి ఐక్యత కోసం శ్రీమతి విజయమ్మ ప్రాణాలను పణంగా పెట్టి దీక్ష చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ ఏ ఒక్కరి సొత్తూ కాదన్నారు. కేసీఆ‌ర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం మానుకోవాలని‌ ఆయన హెచ్చరించారు.