సిబిఐ తీరుపై రాష్ట్రపతికి విజయమ్మ ఫిర్యాదు
8 Oct, 2012 02:21 IST
న్యూఢిల్లీ, 8 అక్టోబర్ 2012: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సమావేశమయ్యారు. పార్టీ అధ్యక్షుడు, కడప లోక్సభ సభ్యుడు జగన్మోహన్రెడ్డి విషయంలో సిబిఐ అనుసరిస్తున్న కక్షపూరిత ధోరణిని ఆమె రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్ళారు. దాదాపు గంట పాటు ప్రణబ్తో విజయమ్మ భేటి అయ్యారు. జగన్ కేసులో సీబీఐ వ్యవహరిస్తున్న తీరును వివరిస్తూ రాష్ట్రపతికి వినతిపత్రాన్ని అందజేశారు.
రాష్ట్రపతితో భేటి అనంతరం రాష్ట్రపతి భవన్ ఆవరణలో మేకపాటి, సుబ్బారెడ్డితో కలిసి విజయమ్మ మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్రెడ్డికి బెయిల్ రానివ్వకుండా సిబిఐ పన్నుతున్న కుట్రలను కూలంకషంగా రాష్ట్రపతికి వివరించినట్లు విజయమ్మ తెలిపారు. ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ఐదు నెలల పాటు బెయిల్ రాకుండా సిబిఐ అడ్డుకున్న విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లామన్నారు. జగన్బాబును అణగదొక్కేందుకు కాంగ్రెస్, టిడిపిలు సిబిఐతో కుమ్మక్కై పన్నుతున్న దుష్ట పన్నాగాలను కూడా నివేదించినట్లు చెప్పారు. దర్యాప్తు విషయంలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించి న్యాయం జరిగేలా చూడాలని విన్నవించామన్నారు. తాము చెప్పిన విషయాలను విన్న రాష్ట్రపతి పరిశీలిస్తామని హామీ ఇచ్చారని విజయమ్మ చెప్పారు.
రాష్ట్రపతిగా ఎన్నికైన ప్రణబ్ ముఖర్జీకి జగన్ తరఫున తాము ప్రత్యేకంగా అభినందనలు తెలిపామన్నారు. ‘సుప్రీంకోర్టులో ఈ నెల 5న జరిగిన బెయిల్ పిటిషన్పై విచారణ అనంతరం జగన్బాబు బయటకు వస్తారని అనుకున్నాం. జగన్ బయటకు వచ్చాక ఆయనే స్వయంగా ఢిల్లీకి వచ్చి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని అభినందించాలనుకున్నారు. కానీ అది కుదరకపోవటంతో రాష్ట్రపతి ప్రణబ్ను కలిసి అభినందనలు తెలపాలని జగన్ మమ్మల్ని పంపారు. రాష్ట్రపతి ఎన్నికలయ్యాక ప్రణబ్ను కలుసుకోలేదు. అందుకే ఇప్పుడు కలిసి అభినందనలు తెలిపాం’ అని విజయమ్మ తెలిపారు.
‘పార్టీని బలోపేతం చేసేందుకు మీరు, షర్మిల పాదయాత్ర చేయనున్నారా?’ అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ‘ఇంకా నిర్ణయం తీసుకోలేదు’ అని విజయమ్మ బదులిచ్చారు. విజయమ్మతో పాటు ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి, పార్టీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి కూడా ప్రణబ్ను కలిశారు.
సిబిఐతో కాంగ్రెస్, టిడిపి కుమ్మక్కు: మేకపాటి
కాగా, సిబిఐ కక్షపూరిత వైఖరిని రాష్ట్రపతికి వివరించినట్లు పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి తెలిపారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు సిబిఐతో కుమ్మక్కై వైయస్ జగన్మోహన్రెడ్డిని పూర్తిగా నిర్బంధంలో ఉంచేందుకు కుట్రను అమలు చేస్తున్నాయని రాజమోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ప్రస్తుతం జగన్ విషయంలో సిబిఐ వ్యవహరిస్తున్న తీరు కక్షపూరితమనే విషయం సామాన్యుడికి సైతం అర్తమవుతోందన్నారు. జగన్ బెయిల్ పిటిషన్ విచారణకు ఒక రోజు ముందు టిడిపి ఎంపిలు కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరాన్ని కలిసిన రెండు గంటల్లోనే ఆస్తుల జప్తుకు సంబంధించి ఈడీ ఆదేశాలు ఇవ్వటాన్ని కూడా రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. గతంలో సిబిఐ కుట్రపూరిత చర్యలను వివరిస్తూ ప్రధానమంత్రికి అందించిన వినతిపత్రాన్నే రాష్ట్రపతికి కూడా సమర్పించామన్నారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన కొన్ని ప్రశ్నలకు మేకపాటి రాజమోహన్రెడ్డి బదులిస్తూ ‘పార్టీ కీలక సమావేశం జరగాల్సి ఉంది. అందులో నిర్ణయాలు తీసుకుంటాం. అన్నీ మీరే చూస్తారుగా’ అని పేర్కొన్నారు.