ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే..!

19 Sep, 2015 14:50 IST
హైదరాబాద్ః ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందేనని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి ఈనెల 25లోపు ప్రకటన చేయాలని  పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈనెల 26 నుంచి తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరులో  నిరవధిక నిరాహార దీక్షకు దిగుతారని ప్రభుత్వాలను హెచ్చరించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో చంద్రబాబుపై బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు. ఏపీ ప్రభుత్వం పంచభూతాలను కూడా దోచుకుంటుందని  మండిపడ్డారు. 

చంద్రబాబు సర్కార్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయందని బొత్స ఫైరయ్యారు.  రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిలో చంద్రబాబు వాటా ఎంతో చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి, తన సహచరుల అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు అధికారులను బలిచేస్తున్నారని సత్యనారాయణ మండిపడ్డారు. గోదావరి పుష్కరాల తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం వేసిన విచారణ కమిటీ కంటితుడుపు చర్యగా బొత్స అభివర్ణించారు. కమిటీకి ఆరునెలల గడువు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.