నంద్యాల: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల ఉప ఎన్నికల అభ్యర్థి శిల్పా మోహన్రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అనుచరులతో ఇంటి నుంచి బయల్దేరిన శిల్పా నంద్యాల ఆర్డీఓ కార్యాలయంలో రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. సింపుల్గా నామినేషన్ వేసేందుకు బయల్దేరిన శిల్పాకు అభిమానులు, కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. భారీ సంఖ్యలో నామినేషన్ ప్రక్రియకు తరలివచ్చారు.
నంద్యాలలో గెలవకుంటే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని, టీడీపీ అభ్యర్థి ఓడితే మంత్రి భూమా అఖిలప్రియ రాజీనామా చేస్తారా అని శిల్పా మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. తన సవాల్ను స్వీకరించే దమ్ము టీడీపీ నాయకులకు ఉందా అని ప్రశ్నించారు.
రాజీనామా విషయంలో తనకు డ్రామాలు ఆడడం చేతకాదని, అందుకే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖ పంపానని మోహన్రెడ్డి సోదరుడు శిల్పా చక్రపాణిరెడ్డి తెలిపారు. శాసనమండలి మండలి చైర్మన్కు రాజీనామా లేఖ పంపినట్టు ఆయన వెల్లడించారు. పార్టీ ఫిరాయించిన 20 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే దమ్ము టీడీపీకి ఉందా అని ప్రశ్నించారు.
ఎవరెన్ని కుట్రలు చేసినా నంద్యాలలో తమదే గెలుపని విశ్వాసం వ్యక్తం చేశారు. శిల్పా కుటుంబం ఎప్పుడూ శాంతిని కోరుకుంటుందని చెప్పారు. 'దేవుడిచ్చిన దాంట్లో ఎంతోకొంత సమాజానికి మేం తిరిగి ఇస్తున్నాం. ఇన్నేళ్లు మచ్చలేని రాజకీయాలు చేశాం. ఇకపై కూడా నంద్యాల ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటామ'ని చక్రపాణిరెడ్డి అన్నారు