షర్మిల సమక్షంలో వైయస్ఆర్సిపిలోకి మైనార్టీలు
26 Nov, 2012 19:22 IST
మల్దకల్, 26 నవంబర్ 2012: పాలమూరు జిల్లాలోని పలువురు టిడిపి ముస్లిం మైనార్టీ నాయకులు సోమవారంనాడు షర్మిల సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజల సమస్యలు పట్టించుకోని అమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వానికి, దానికి వత్తాసు పలుకుతున్న టిడిపి తీరుకు నిరసనగా వైయస్ జగన్మోహన్రెడ్డి తరఫున ఆయన సోదరి మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. షర్మిల పాదయాత్ర 4౦వ రోజు మహబూబ్నగర్ జిల్లా గద్వాల నియోజయవర్గంలోని మల్దకల్లో కొనసాగుతున్న సందర్భంగా పలువురు మైనార్టీ నాయకులు షర్మిల నుంచి పార్టీ తీర్థం తీసుకున్నారు. అనంతరం వారు షర్మిలతో పాటు పాదయాత్రలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు మాట్లాడుతూ, దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి తమ వర్గానికి చేసిన మేళ్ళను గుర్తుచేసుకున్నారు. తమకు 4 శాతం రిజర్వేషన్ కల్పించింది వైయస్ రాజశేఖరరెడ్డి అని గుర్తుచేసుకున్నారు. ఆయన హయాంలోనే ముస్లింలు ఆర్థికంగా, విద్యాపరంగా ఉన్నతి చెందారన్నారు. తమకు ఎంతో మేలు చేసిన వైయస్ కుటుంబానికి అండగా నిలుస్తామని వారంతా ముక్తకంఠంతో చెప్పారు.