షర్మిల మరో ప్రజాప్రస్థానం 59వ రోజు ప్రారంభం
7 Feb, 2013 11:17 IST
ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి జిల్లా), 7 ఫిబ్రవరి 2013 : మరో ప్రజా ప్రస్థానం 50వ పాదయాత్రను శ్రీమతి షర్మిల గురువారం ఉదయం ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నుంచి ఆమె ఉదయం 10.30 గంటలకు పాదయాత్ర చేపట్టారు. మోకాలికి గాయం తగిలిని కారణంగా మధ్యలో నిలిపిన పాదయాత్రను శ్రీమతి షర్మిల బుధవారం తుర్కయాంజాల్ నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే.
ప్రజాకంటక కాంగ్రెస్ ప్రభుత్వం తీరుకు, దానికి వంత పాడుతున్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు వైఖరికి నిరసనగా వైయస్ఆర్సిపి అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి తరఫున శ్రీమతి షర్మిల సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.
మరో ప్రజాప్రస్థానంలో భాగంగా శ్రీమతి షర్మిల గురువారం ఇబ్రహీంపట్నం నుంచి చౌదరిపల్లి గేటు వరకూ పాదయాత్ర చేస్తారు. ఇబ్రహీంపట్నం నుంచి ప్రారంభమైన ఆమె పాదయాత్ర ఖానాపూర్ గేటు మీదుగా ఆగపల్లికి చేరుతుంది. అక్కడ శ్రీమతి షర్మిల భోజన విరామం తీసుకుంటారు. అనంతరం గుణగల్ మీదుగా చౌదరిపల్లిగేటు వరకూ నడుస్తారు. ఈ రోజు శ్రీమతి షర్మిల మొత్తం 12.9 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు. చౌదరిపల్లిగేటు వద్ద శ్రీమతి షర్మిల రాత్రికి బస చేస్తారు.
వైయస్సిపి నాయకులు ప్రత్యేక పూజలు:
శ్రీమతి షర్మిల చేపట్టిన పాదయాత్ర విజయవంతంగా కొనసాగాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం ఉదయం ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా నేరేడ్మెట్లోని కనకదుర్గమ్మవారి ఆలయంలో పార్టీ నాయకులు సుమతీ మోహన్, బ్రహ్మయ్య చౌదరి ఈ పూజలు నిర్వహించారు.