బాబు భూ సంతర్పణలపై ఫిర్యాదు

22 Nov, 2015 22:14 IST


సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా అత్యంత విలువైన సర్కారీ భూములను అత్తెసరు ధరలకే ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం కేటాయిస్తుండటంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  విశాఖపట్నం జిల్లా మధురవాడలో రూ.338 కోట్ల విలువైన 50 ఎకరాల భూమిని ఓ ఐటీ సంస్థకు.. ఏపీఐసీకి చెందిన విలువైన 489 ఎకరాల భూమిని వీబీసీ ఫర్టిలైజర్స్‌కు అత్తెసరు ధరలకే ఎలా కేటాయిస్తారని కేంద్ర ఇంధన శాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ ప్రశ్నించారు. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై సుప్రీం కోర్టు ఫిబ్రవరి 2, 2012న ఇచ్చిన తీర్పులో భూ కేటాయింపులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కీలకమైన సూచనలు చేసిందని గుర్తు చేశారు. రోజు రోజుకూ భూముల ధరలు ఆకాశన్నంటోన్న నేపథ్యంలో.. ప్రభుత్వ భూములు లభ్యత, వాటి పరిరక్షణ కీలకంగా మారిందని సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యను గుర్తు చేశారు.ఈ వ్యవహారంపై స్వతంత్ర న్యాయ విచారణ జరిపించి.. ఈ భూదందా వెనుక దాగిన కుట్రను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుకు శర్మ లేఖాస్త్రం సంధించారు.