'సహకార ఫలితాలతో ప్రత్యర్థుల కళ్ళు తిరగాలి'

19 Jan, 2013 13:26 IST
హైదరాబాద్ : కాంగ్రెస్‌, టిడిపిల కళ్ళు తిరిగేలా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా సహకార సంఘాల ఎన్నికల ఫలితాలు రాబట్టాలని పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, ఉభయ గోదావరి జిల్లాల సమన్వయకర్తం డాక్టర్‌ ఎం.వి. మైసూరారెడ్డి వైయస్‌ఆర్‌సిపి నాయకులకు పిలుపునిచ్చారు. సహకార సంఘాల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేసి డిసిసిబి పీఠాన్ని దక్కించుకునేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. సహకార ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పశ్చిమ గోదావరి జిల్లా నాయకులతో శుక్రవారం నిర్వహించిన కీలక సమావేశానికి మైసూరారెడ్డి అధ్యక్షత వహించారు. రైతులకు దివంగత మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి చేసినంత మేలు మరే ప్రభుత్వంలోనూ జరగలేదన్నారు. రైతుల సంక్షేమానికి, వారి కుటుంబాల్లో వెలుగులు నింపడానికి వై‌యస్ ‌నిరంతరమూ తపించారన్నారు.

రైతుల కష్టాలు, సమస్యలను మానవీయ కోణంలో ముఖ్యమంత్రిగా‌ మహానేత వైయస్ పరిష్కరించిన తీరు ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శమైందని చెప్పారు. సహకార సంఘాల పురోభివృద్ధికి పాటుపడిన వైయస్‌ను రైతులు ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటారన్నారు. రానున్న సహకార ఎన్నికల్లో వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీనే రైతులు కచ్చితంగా గెలిపిస్తారన్నారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని మైసూరారెడ్డి సూచించారు.

ఈ సమావేశంలో పార్టీ పశ్చిమగోదావరి జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళ నాని, చింతలపూడి ఎమ్మెల్యే మద్దాల రాజే‌ష్‌కుమార్, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, పాతపాటి సర్రాజు, పెండ్యాల వెంకట కృష్ణారావు, ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి చేగొండి హ‌రిరామ జోగయ్య, పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఇందుకూరి రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.