'సహకార' అక్రమాలపై వైయస్ఆర్సిపి నిరసన
28 Jan, 2013 19:13 IST
హైదరాబాద్, 28 జనవరి 2013: సహకార సంఘాల ఎన్నికల సందర్భంగా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల అక్రమాలకు తెగబడుతున్నారు. తాజాగా సోమవారంనాడు పలు చోట్ల కాంగ్రెస్ నాయకులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మీద దాడులకు బరితెగించారు. ఒక వైపున కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతుంటే అక్కడే ఉన్న పోలీసులు చోద్యం చూస్తున్నట్లు మిన్నకుండిపోవడం గమనార్హం.
రేణిగుంట పిఎస్కు రోజా, మిథున్రెడ్డి తరలింపు
తిరుపతి: తిరుపతి నియోజకవర్గ పరిధిలోని సాయంపేట సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోయారు. నామినేషన్లు వేయడానికి వచ్చిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. వైయస్ఆర్సిపి నాయకులపై దాడికి యత్నించారు. అక్కడే ఉన్న పోలీసుల చోద్యం చూశారు. పోలీసుల తీరుపై వైయస్ఆర్సిపి నాయకురాలు రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనితో రోజాతో సహా వైయస్ఆర్సిపి నేతలందరినీ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం రోజాను, పార్టీ నాయకుడు మిథున్రెడ్డిలను వడమాలపేట పోలీస్ స్టేషన్ నుంచి రేణిగుంట పిఎస్కు తరలించారు.
కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యం:
చిత్తూరు జిల్లా సాయంపేట సహకార సంఘాల ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యకాండకు పాల్పడ్డారు. నామినేషన్లు వేయకుండా వైయస్ఆర్ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను వారు అడ్డుకున్నారు. పోలీసుల సాక్షిగా వైయస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలపై వారు దాడి చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం గమనార్హం.
పుట్టపర్తిలో టిడిపి - వైయస్ఆర్సిపి ఘర్షణ:
అనంతపురం: పుట్టపర్తి సహకార ఎన్నికల్లో ఘర్షణ చోటు చేసుకుంది. వైయస్ఆర్సిపి, టిడిపి కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. వైయస్ఆర్సిపి బలపరిచిన అభ్యర్థి నర్సమ్మను ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి కిడ్నాప్ చేశారని డిఎస్పి వెంకటయ్య ఎదుట వైయస్ఆర్సిపి కార్యకర్తలు ఆందోళన చేశారు.