జగన్ సమైక్యవాదాన్ని స్వాగతిస్తున్నా: సబ్బం
కాంగ్రెస్ అధినాయకత్వాన్ని ఢీ కొట్టగల ఏకైక నాయకుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనిని అనకాపల్లి కాంగ్రెస్ ఎంపీ సబ్బం హరి పేర్కొన్నారు. అందుకే రాష్ట్ర ప్రజలంతా శ్రీ జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన చంచల్గూడ జైలుకు వెళ్ళి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను మూడున్నరేళ్లుగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నానని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను ఆ పార్టీ తరఫునే పోటీ చేస్తానని తెలిపారు. ఓ పార్టీ అధ్యక్షునిగా ఉంటూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉండాలన్న నాయకుడు కేవలం శ్రీ జగన్ మాత్రమేనని సబ్బం పేర్కొన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఆయన తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. శ్రీ జగన్మోహన్ రెడ్డికి త్వరలోనే బెయిల్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.