- రాబోయే రోజుల్లో ప్రతిపక్షంలో కూర్చుంటారని బాబుకు తెలుసు
- అందుకే లోకేష్కు చంద్రబాబు ట్రైనింగ్ ఇస్తున్నారు
- వైయస్ జగన్ సభకు వస్తే చంద్రబాబుకు భయం
- లెక్కలతో సహా కడిగేస్తాడని టీడీపీకి వణుకు
- బాధ్యత గల ప్రతిపక్షనేతగా ఢిల్లీ నుంచి గల్లీ వరకు పోరాటాలు
- బాబుకు ఉన్న గుణం దోచుకోవడం.. విదేశాల్లో దాచుకోవడం
- ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకే సమావేశాలు బహిష్కరించాం
- అసెంబ్లీకి స్పీకర్ సుప్రీం అయితే ఫిరాయింపులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు
- వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా
హైదరాబాద్: ప్రతిపక్షం లేకుండా తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ నిర్వహిస్తున్న తీరు చూస్తే ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో జరిగే ట్రైనింగ్ క్లాసుల్లా ఉందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. ప్రతిపక్షం మనమే అని చంద్రబాబు ఊరుకే అనలేదని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెడతారని తెలిసిపోయిందన్నారు. అందుకనే ప్రతిపక్షనాయకుడిగా ఎలా వ్యవహరించాలో.. లోకేష్కు ట్రైనింగ్ ఇస్తున్నారన్నారు. హైదరాబాద్ లోటస్పాండ్లోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్యే రోజా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రజల చేత ఎన్నికయ్యే ధైర్యం లేక తన కొడుకు పప్పును అడ్డదారిలో చంద్రబాబు మంత్రిని చేశారని విమర్శించారు. పిల్లనిచ్చిన మామ బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గానికి నీళ్లు, రోడ్ల సౌకర్యం కల్పించలేని లోకేష్కు ఏ విధంగా అవగాహన ఉందో అర్థం చేసుకోవాలన్నారు.
మూడున్నర సంవత్సరాలుగా అసెంబ్లీలో ప్రజా సమస్యలపై లెక్కలతో సహా ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్రెడ్డి చంద్రబాబు నిలదీశారని రోజా పేర్కొన్నారు. వాటికి సమాధానం చెప్పలేక ఉక్కిరి బిక్కిరి అయిన చంద్రబాబు తప్పించుకోవడానికి వైయస్ జగన్పై బురదజల్లేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై నిత్యం పోరాడే వైయస్ జగన్కు బాధ్యత లేదని, అందుకే అసెంబ్లీకి రాలేదని ఆరోపణలు చేయడం దుర్మార్గమన్నారు. బాధ్యత గల ప్రతిపక్షనేతగా ప్రతీ సమస్యపై ఢిల్లీ నుంచి గల్లీ వరకు పోరాడారన్నారు. వైయస్ జగన్ బాధ్యతగా అసెంబ్లీలో ప్రస్తావించిన ఏ ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేకపోయారన్నారు. కేవలం ప్రతిపక్షనేతను, సభ్యులను దూషిస్తూ పబ్బం గడుపుకుంటూ ప్రజా సమస్యలు పరిష్కరించకుండా ఇబ్బందులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజా కోర్టులో టీడీపీ తప్పులను, ఎండగడుతూ ప్రజల మధ్య నుంచి ప్రభుత్వానికి సమస్యలు తెలియజేయడానికి ప్రతిపక్షనేత పాదయాత్ర చేస్తున్నారన్నారు.
రాష్ట్రంలో ఏ సమస్య లేదు. రుణమాఫీలు చేశా, ఉద్యోగాలు ఇచ్చేశా.. పెన్షన్లు ఇప్పించా.. ఎస్సీ, ఎస్టీలకు ల్యాండ్లు ఇప్పించానని, గృహాలు ఇచ్చేశానని చెప్పడం విడ్డూరంగా ఉందని రోజా ఎద్దేవా చేశారు. బహుశా చంద్రబాబుకు హ్యాలోజినేషన్ 6 స్టేజీలో ఉన్నట్లుందని, అందుకే జరిగిపోయినట్లుగా అనిపిస్తుందన్నారు. ఎన్నో సార్లు సవాలు చేశాం ప్రతి గ్రామానికి రండి.. మీకు ధైర్యం ఉంటే వైయస్ జగన్తో నడవండి.. ఎక్కడైనా రోడ్లు, డ్రైనేజీలు సక్రమంగా ఉన్నాయా.. ఒక్క నిరుద్యోగికైనా ఉద్యోగం వచ్చిన దాఖలాలు ఉన్నాయా.. ఇలా అనేక గురించి మాట్లాడేందుకు మేం సిద్ధంగా ఉన్నామన్నారు.
చంద్రబాబుకు ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదని, ఎంతసేపు రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలి.. విదేశాల్లో ఏ విధంగా దాచుకోవాలనే ఆలోచన మాత్రమే ఉందన్నారు. అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్షం భయపడి పారిపోయిందని మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందన్నారు. హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంటే ఓటుకు కోట్ల కేసులో అడ్డంగా దొంగలా దొరికిన చంద్రబాబు హైదరాబాద్ నుంచి పారిపోయి అమరావతిలో దాక్కోవడాన్ని భయం అంటారని విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తుంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశ్యంతో ప్రజల మధ్యలో ఉంటూ రచ్చబండ, పల్లెనిద్ర చేస్తూ గ్రామాల సమస్యలు చాటిచెబుతామన్నారు. వైయస్ జగన్ అసెంబ్లీకి వస్తుంటూ చూసి భయపడేది చంద్రబాబు అని, ఎక్కడ ప్రజా సమస్యలు అన్ని లెక్కలతో సహా చూపించి నిలదీస్తారనే భయం టీడీపీలో ఉందన్నారు.
తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రతి సంవత్సరం 80 రోజులు సభ పెట్టాలని దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డిని డిమాండ్ చేసిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు అన్ని రోజులు నిర్వహించడం లేదని రోజా ప్రశ్నించారు. వైయస్ఆర్ 5 సంవత్సరాల్లో 256 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే చంద్రబాబు మూడున్నరేళ్లుగా కేవలం 80 రోజులు మాత్రమే సమావేశాలు పెట్టారన్నారు. వైయస్ జగన్ పాదయాత్ర చేపడుతున్నట్లుగా ప్రకటించగానే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నామని చంద్రబాబు చెప్పారన్నారు. వైయస్ జగన్ రాడనే ధైర్యతో పది రోజులు పెట్టారన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ప్రతిపక్షం లేకుండా చేయాలని 22 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంటే.. సభలోకి వెళ్తే మేం కూడా దానికి మద్దతు ఇచ్చిన వారం అవుతామని సమావేశాలను బహిష్కరించామన్నారు. అంతేగానీ భయపడి కాదు చంద్రబాబూ అని రోజా ధ్వజమెత్తారు. ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థి ఫిరాయింపులకు పాల్పడితే వెంటనే అనర్హుడిగా ప్రకటించాలని చట్టంలో ఉందన్నారు. అయినా స్పీకర్ వారిపై చర్యలు తీసుకోకుండా వారి పార్టీలోనే ఉంచాలని చూస్తున్నారన్నారు. ప్రతిపక్షం లేకుండా సభ జరపడం స్పీకర్కు మాయని మచ్చ అని రోజా అభిప్రాయపడ్డారు. అధికార పక్షాన్ని, ప్రతిపక్షాన్ని రెండు కళ్లుగా చూసుకొని ప్రజాస్వామ్య బద్ధంగా సమస్యల పరిష్కారం దిశగా సభ నడిపించాలని సూచించారు.
ఫిరాయింపు దారులపై స్పీకర్ కోడెల చర్యలు తీసుకోకుండా చేతులు దులుపుకుంటూ యాక్టింగ్ చేయడం చాలా దురదృష్టకరమన్నారు. కాల్మనీ సెక్స్రాకెట్పై పోరాడుతుంటే ప్రభుత్వం దొరికిపోతుందని, అసెంబ్లీ రూల్స్కు వ్యతిరేకంగా తనను సంవత్సరం పాటు సస్పెండ్ చేశారని రోజా గుర్తు చేశారు. సుప్రీం కోర్టుకు వెళ్లి పోరాడితే సింగిల్ బేంచ్ జడ్జీ అసెంబ్లీకి వెళ్లాలని తీర్పు ఇచ్చారన్నారు. అప్పుడు చంద్రబాబు, స్పీకర్, యనమల కలిసి అసెంబ్లీకి స్పీకర్ సుప్రీం అన్నారు. అసెంబ్లీకి స్పీకర్ సుప్రీం అయినప్పుడు ఫిరాయింపుదారులపై అనర్హత వేటు మాత్రం కోర్టులో ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో, దేశంలో కానీ రాజ్యాంగ న్యాయనిపుణులు, రిటైర్డ్జడ్జీలు ఎవరితోనైనా ఫిరాయింపులను ప్రోత్సహించవచ్చు అని చెప్పితే దానిపై చర్చలు ఉండవన్నారు.
40 ఏళ్ల వయస్సు ఉన్న వైయస్ జగన్ ధైర్యంగా చంద్రబాబును ఎదుర్కొంటుంటే.. 40 ఏళ్ల అనుభవం ఉన్న నువ్వు చేస్తున్నదేమిటీ అని చంద్రబాబును ప్రశ్నించారు. 40 ఏళ్ల అనుభవంలో అసెంబ్లీని బైకాట్ చేసిన ప్రతిపక్షాన్ని చూడలేదన్న చంద్రబాబు.. 40 ఏళ్ల సర్వీస్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేసి మంత్రులను చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చరిత్ర ఎక్కడైనా చూశావా..? నీకు సిగ్గు అనిపించడం లేదా చంద్రబాబూ అని ప్రశ్నించారు.