ఓటేసే ముందు వైయస్ఆర్ను గుర్తుచేసుకోండి
మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డిని ప్రేమించే ప్రతి గుండె ఒక్కటవ్వాలని, పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేటప్పుడు ఆయనను ఒక్కసారి గుర్తు చేసుకుని, వైయస్ఆర్సీపీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, విశాఖ పార్లమెంటరీ స్థానంలో పార్టీ అభ్యర్థి శ్రీమతి వైయస్ విజయమ్మ పిలుపునిచ్చారు. పార్టీఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ లోక్సభా స్థానం పరిధిలో నగరంలోని తూర్పు, ఉత్తరం, దక్షిణ నియోజకవర్గాల్లో ఆమె శనివారం వైయస్ఆర్ జనభేరి రోడ్షో ఆమె వివిధ జంక్షన్లలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
‘దివంగత మహానేత భార్యగా.. జగన్బాబు తల్లిగా.. మీలో ఒకరిగా ఒక్కమాట
చెబుతున్నా.. రాజశేఖరరెడ్డి మన నుంచి వెళ్లిపోయారు. కొడుకు, కూతురు ఉన్నా..
ఆయన లేని లోటు నాకు తీరేది కాదు. కానీ ఆ మహానేత వారసునిగా ఆయన ఆశయాల
సాధనలో జగన్బాబు మీ వెన్నంటి నిలిచి కష్టసుఖాలు పంచుకుని, మీకు ఆయన లేని
లోటు తీర్చుతాడు’ అని ప్రజలకు ఆమె భరోసా ఇచ్చారు.
ఎన్నికల వేళ వచ్చిపోయేదాన్ని కాదని.. మీలో ఒకరిగా ఉంటూ ప్రతీ సమస్యనూ పరిష్కరిస్తానని శ్రీమతి విజయమ్మ స్థానికుల్లో భరోసా నింపారు. సింహాచలం దేవాలయ భూసమస్య, కాలుష్యం, ఐటీ, ఫార్మా కంపెనీలు, పోలవరం ప్రాజెక్టు తదితర స్థానిక సమస్యలపై మాట్లాడినప్పుడు ప్రజల్లో భారీ స్పందన కనిపించింది.
ఈఎన్నికల ప్రచారంలో పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ, అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులు వంశీకృష్ణ శ్రీనివాస్ (విశాఖ తూర్పు), చొక్కాకుల వెంకటరావు (విశాఖ ఉత్తరం), కోలా గురువులు (విశాఖ దక్షిణం), పార్టీ నగర అధ్యక్షుడు మళ్ల విజయ్ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.