వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
17 Sep, 2012 03:16 IST
హైదరాబాద్, 17 సెప్టెంబర్ 2012: అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభం అయ్యాయి. అయితే, తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు సభలో తీవ్ర గందరగోళం సృష్టించడంతో సమావేశమైన కొద్ది నిమిషాల్లోనే గంట సేపు వాయిదా పడింది. సభ ప్రారంభం కాగానే స్పీకర్ నాదెండ్ల మనోహర్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహా విపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను తిరస్కరించారు. దీనితో టీఆర్ఎస్ సభ్యులు పోడియం వద్దకు దూసుకెళ్లారు. వాయిదా తీర్మానాలపై చర్చకు అనుమతించాలంటూ నినాదాలు చేశారు. ఫ్లకార్డులు పట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సమస్యలను సామరస్యంగా చర్చించుకుందామని, ఆందోళన విరమించాలని స్పీకర్ విపక్ష సభ్యులకు పదేపదే విజ్ఞప్తి చేశారు. అయినా ఫలితం లేకపోవటంతో సభాపతి సమావేశాలను గంటపాటు వాయిదా వేశారు.