రాష్ట్రవ్యాప్తంగా వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తల అరెస్టులు

31 Aug, 2012 01:20 IST

హైదరాబా‌ద్‌, 31 ఆగస్టు 2012 : విద్యుత్‌ సరఫరా విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న సర్కార్‌ ధోరణికి నిరసనగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం నిర్వహిస్తున్న రాష్ట్రవ్యాప్త బంద్‌కు అన్నివర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. అయితే బంద్‌ను భగ్నం చేయడానికి పోలీసులు విఫలయత్నాలు చేస్తున్నారు. గురువారం అర్ధరాత్రి నుంచే గృహనిర్బంధాలు, అరెస్టులు చేస్తున్నారు. బంద్‌పై పోలీసులు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు.

కాగా విద్యుత్‌ కోతలకు నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చిన తమపార్టీ నేతలు, కార్యకర్తలపై ప్రభుత్వం దమననీతికి పాల్పడుతోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు మండిపడ్డారు. బంద్‌ చేసుకునే హక్కు కూడా లేదన్నట్లు పోలీసులను ప్రయోగిస్తోందని విమర్శించారు. హైదరాబాద్‌ ఎంజీబీఎస్‌లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు , పలువురు పార్టీ నేతలు అరెస్ట్‌ అయ్యారు. దమననీతికి పాల్పడుతున్న కిరణ్‌కుమార్‌రెడ్డికి కూడా చంద్రబాబుకు పట్టిన గతే పడుతుందని గట్టు రామచంద్రరావు ఈ సంర్భంగా హెచ్చరించారు.

విశాఖపట్నంలో కూడా పోలీసులు జులం ప్రదర్శిస్తున్నారు. చాలామంది కార్యకర్తల్ని అరెస్టు చేశారు. పోలీసుల అరెస్ట్‌కు నిరసనగా అయిదవ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.

శ్రీకాకుళం జిల్లాలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బంద్‌కు ప్రజలు మద్దతు పలికారు. పాఠశాలలు, వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా బంద్‌కు మద్దతు తెలిపాయి. ఇక్కడా కూడా పోలీసులు తమ అత్యుత్సాహన్ని ప్రదర్శించారు. అర్ధరాత్రి నుంచే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. కార్యకర్తల అరెస్టులపై పార్టీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రకాశం జిల్లాలో పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలను బలవంతంగా అదుపులోకి తీసుకుంటున్నారు. ‌గత అర్ధరాత్రి నుంచే పార్టీ నాయకులను గృహ నిర్బంధంలో ఉంచిన పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులకు దిగుతున్నారు. పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చిన బంద్‌ను భగ్నం చేయడానికి వరంగల్‌లో పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నారు. చాలా మందిని గృహనిర్బంధం చేశారు.

నిజామాబాద్ జిల్లాలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బంద్‌కు అనూహ్య మద్దతు లభించింది. బంద్‌ను విజయవంతం చేసేందుకు పార్టీ కార్యకర్తలు తెల్లవారుజాము నుంచే రోడ్డెక్కారు. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్‌ నిజామాబాద్‌ ఆర్టీసి డిపో ఎదుట బైఠాయించి నిరసన తెలియజేశారు.

ప్రభుత్వ వైఖరిపై భూమన మండిపాటు :

కరెంట్‌ కోతలకు నిరసనగా తిరుపతిలో నిరసన తెలుపుతున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలపై పోలీసులు విరుచుకుపడ్డారు. మహిళలని కూడా చూడకుండా జీపుల్లోకి ఈడ్చిపడేశారు. దీంతో పార్టీ కార్యకర్తలు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.

బంద్‌ను అణిచివేయడానికి ప్రభుత్వం కర్కశంగా వ్యవహారిస్తోందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. ప్రజల కష్టాలను, సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకుండా పోలీసులను ప్రయోగిస్తోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు విమర్శించారు. మీడియాతో మాట్లాడుతున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలకు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.