చంద్రబాబుది ప్రచార ఆర్భాటం
– వైయస్ఆర్సీపీ నేత బెల్లాన చంద్రశేఖర్
విజయనగరం(చీపురుపల్లి): రాష్ట్రంలో ప్రజల దృష్టిని మరల్చడంతో పాటు ప్రచార ఆర్భాటం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఏరువాక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని వైయస్ఆర్సీపీ విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు బెల్లాన చంద్రశేఖర్ మండిపడ్డారు. మండలంలోని రామలింగాపురంలో వరి విత్తనాలు పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ కోసం ప్రతీ ఒక్కరూ చర్చించుకుంటున్న నేపధ్యంలో ఆ దృష్టిని మరల్చేందుకు ఏరువాక అంటూ హడావుడి చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే రైతులు దుక్కులు దన్నుకుని విత్తనాలు వేసుకున్నాక ఏరువాక అంటూ రైతులను చంద్రబాబునాయుడు మభ్య పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబునాయుడుకు నిజంగా రైతులుపై ప్రేమ ఉంటే ఆయన ఇచ్చిన మాట ప్రకారం రైతులు రుణాలు మాఫీ చేయాలి తప్ప ఇలా ఏరువాక కార్యక్రమాలు పేరుతో ప్రజాధనం లూటీ చేయకూడదని హితవు పలికారు. కార్యక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షుడు రేవల్ల సత్తిబాబు, మండల పార్టీ నాయకులు ఇప్పిలి అనంతం, కరిమజ్జి శ్రీనివాసరావు, రామలింగాపురం, అలజంగి సర్పంచ్లు కంది పాపినాయుడు పాల్గొన్నారు.