రాష్ట్ర విభజనపై హైదరాబాద్లో ఓటింగ్ పెట్టాలి
సమైక్య రాష్ట్రమా.. విభజనా? ఈ అంశాలపై ప్రజలు ఏమి కోరుకుంటున్నారో రాజధాని హైదరాబాద్లో బహిరంగ ఓటింగ్ నిర్వహిస్తే స్పష్టంగా తేలిపోతుందని వైయస్ఆర్ కాంగెస్ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్తో కర్నూలు జిల్లా నంద్యాలలో ఆయన సోమవారంనాడు నిరాహార దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర సమైక్యతకు కృషి చేసిన ఇందిరాగాంధీ, ఎన్టీఆర్, పొట్ట్టి శ్రీరాములు ఆత్మలు తీవ్రంగా క్షోభ పడేలా సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. వీరిద్దరూ భవిష్యత్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ప్రాంతాలకు అతీతంగా వ్యవహరించడంతో పాటు అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందించారన్నారు. అందుకే సీమాంధ్రలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతబలం ఉందో.. తెలంగాణలోనూ అంతే ఆదరణ ఉందని భూమా నాగిరెడ్డి పేర్కొన్నారు.