హైదరాబాద్: ఫిరాయింపు నిరోధక చట్టంలో సవరణ కోరుతూ ప్రైవేటు బిల్లు
తెస్తున్నట్లు వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి
వెల్లడించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన
అంశాలపై పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఎంపీలతో శనివారం
భేటీ అయ్యారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో
మాట్లాడారు. రాజకీయ పార్టీలకతీతంగా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం శ్రమిస్తోందని వివరించారు. ప్రజాస్వామ్యం
కలకలం వర్థిల్లాలి అంటే రాజ్యంగంలో ఉన్నట్టువంటి మూడు భాగాలు 1.
ఎగ్జిక్యూటివ్,
2. జ్యుడిషిరీ, 3. లెజిస్ట్రేచర్లు సమన్వయంతో పని చేయాలని
ఆయన అన్నారు. ఇందులో ఏ ఒక్కదాంట్లో సమన్వయం లోపించినా ప్రజాస్వామ్య మనుగడ
దెబ్బతినే అవకాశం ఉందని వివరించారు. ఫిరాయింపుల నిరోధక చట్టంలో లో స్పీకర్కు
ఇచ్చిన అధికారాలను రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా దుర్వినియోగం చేయడం జరుగుతుందని
వెల్లడించారు. స్పీకర్ పక్షపాతం ధోరణితో వ్యవహరించడం జరుగుతోందని
పేర్కొన్నారు. పక్షపాతం ధోరణికి ముగింపు పలికే ఆలోచనతో రాజ్యాంగ సవరణ
కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం తప్పకుండా పోరాడతామని చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణను ఏఏ పార్టీలు
కోరుకుంటాయో ఆ పార్టీలకు ఈ సవరణకు ద్వారా మేలు జరుగుతుందని
విజయసాయిరెడ్డి వివరించారు.