ప్రతి పేదవాడికీ సొంతిల్లు.. వైయస్ సంకల్పం
20 Nov, 2012 18:42 IST

సల్కాపురం ప్రజలు తమ సమస్యలను షర్మిలకు మొర పెట్టుకుంటూ విద్యుత్ సరఫరా ఆరు గంటలే చేస్తున్న ప్రభుత్వం బిల్లులు మాత్రం 400 రూపాయలు వసూలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బిల్లులు కట్టలేకపోతే పోలీసులు తమ ఇళ్లకు వచ్చి వేధిస్తున్నారని విలపించారు. వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు ఇప్పటికీ బిల్లులు ఇవ్వడం లేదని వారు వాపోయారు. పావలా వడ్డీ రుణాలకు కూడా రెండు రూపాయల వడ్డీని బలవంతంగా వసూలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. వైయస్ మంజూరు చేసిన పింఛన్లను కూడా రద్దు చేశారని వారు చెప్పారు. విద్యార్థులకు రీయింబర్సుమెంట్ రావడం లేదని, ఉపకార వేతనాలు అసలే వేవని అన్నారు. ఉపాధి హామీ పథకం కింద తమకు నెలకు 20 రోజులు మాత్రమే పని ఇచ్చి, దానికి ఇవ్వాల్సిన కూలీ కూడా కేవలం 30 రూపాయల చొప్పున ఇస్తున్నారని చెప్పారు. తమ పంట ఉత్పత్తులను అమ్మబోతే తక్కువ ధర కడుతున్నారని, తాము కొనబోతే విపరీతమైన ధర చెబుతున్నారని సల్కాపురం రైతులు షర్మిల వాపోయారు.
షర్మిల స్పందిస్తూ, ఆరోగ్యశ్రీని, ఫీజు రీయింబర్సుమెంట్ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని దుయ్యబట్టారు. మహానేత వైయస్ ప్రారంభించిన పథకాలను రాజన్నరాజ్యంలో సమర్థంగా అమలు చేస్తామని సల్కాపురం ప్రజలకు షర్మిల భరోసా ఇచ్చారు. జగనన్న వస్తే రైతన్న తల ఎత్తుకుని తిరిగేలా పాలన చేస్తారన్నారు.
పాదయాత్ర చేస్తూ తమ గ్రామాలకు వస్తున్న షర్మిలతో కరచాలనం చేయడానికి ఆయా గ్రామాల ప్రజలు పోటీలు పడుతున్నారు. షర్మిల అడుగులో అడుగు వేసి నడవడం తమ అదృష్టంగా భావిస్తున్నామని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఒక బాలుడు తన పుట్టినరోజు వేడుకను షర్మిల సమక్షంలో నిర్వహించుకోవడం ఆసక్తి కలిగించింది.