- వైయస్ఆర్సీపీ శ్రేణుల్లో నూతనొత్తేజం
- ప్రజా సంకల్ప యాత్రకు విశేష స్పందన
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నెల 16వ తేదీ ఉదయం 9 గంటలకు వైయస్ జగన్ పాదయాత్ర నెల్లూరు నుంచి ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించింది. లింగసముద్రం మండలం కొత్తపేట నుంచి మొదలైన యాత్ర రాళ్లపాడు రిజర్వాయర్, తాతాహోటల్, జంపాలవారిపాలెం, పెంట్రాల, వాకమళ్లవారిపాలెం మీదుగా మధ్యాహ్నానికి లింగసముద్రం చేరుకుంది. భోజన విరామం అనంతరం లింగసముద్రం నుంచి ప్రారంభమైన యాత్ర బలిజపాలెం, రామకృష్ణాపురం, తిమ్మారెడ్డిపాలెం క్రాస్, వెంగళాపురం, వలేటివారిపాలెం మండలం కమ్మపాలెం మీదుగా సాయంత్రానికి యాత్ర బంగారక్కపాలెం క్రాస్ వద్దకు చేరుకుంది. 89వ రోజు వైయస్ జగన్ 13.3 కి.మీ. మేర నడిచారు. ప్రకాశం జిల్లా పరిధిలో 12.9 కి.మీ. పాదయాత్ర జరిగింది. వైయస్ జగన్కు ప్రకాశం జిల్లా నేతలు ఘన స్వాగతం పలికారు. పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి, కందుకూరు సమన్వయకర్త తూమాటి మాధవరావుతో పాటు జిల్లాలోని 12 నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, ముఖ్యనేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ప్రకాశం జిల్లా పరిధిలో జగన్ పాదయాత్రకు అడుగడుగునా రోడ్డుపై పూలు చల్లటంతో పాటు డప్పులు, బాణ సంచాలు, సన్నాయి, మేళతాళాలు, కళాకారులు వివిధ కళారూపాలతో ఘనస్వాగతం పలికారు. గ్రామదేవతల వేషధారణలతో కళాకారులు రాజన్న బిడ్డకు ఆత్మీయ స్వాగతం పలికారు. పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలు తమ బాధలు చెప్పుకున్నారు. ప్రజా సంకల్ప యాత్రకు ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడంతో దారిపొడువునా జనమే జనం. దారులన్నీ పాదయాత్ర వైపే. తమ అభిమాన నాయకుడు జిల్లాకు రావడంతో పార్టీ శ్రేణుల్లో నూతనొత్తేజం నిండుకొంది. జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. జిల్లాలో యాత్ర మొదలుపెట్టిన మొదటి రోజు వైయస్ జగన్ 1200 కిలోమీటర్ల మైలు రాయిని దాటడంతో సంబరాలు చేసుకున్నారు. రామకృష్ణాపురం గ్రామంలో వీధులన్నీ రంగవల్లులతో, పార్టీ జెండాలతో అలంకరించారు. అన్ని వర్గాల ప్రజల సమస్యలు సావధానంగా వింటున్న వైయస్ జగన్ మరో ఏడాది ఓపిక పట్టాలని భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.