హైదరాబాద్, 27 సెప్టెంబర్ 2012: మన రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఆకాంక్షించారు. ఖైరతాబాద్లోని మహాగణపతికి గురువారం సాయంత్రం ప్రత్యేకంగా పూజలు చేసిన అనంతరం ఆమె భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, రాష్ట్ర ప్రజలకు అన్ని విఘ్నాలు తొలగి సుఖశాంతులతో ఉండాలని తాను ప్రార్థించానని విజయమ్మ పేర్కొన్నారు.
పార్టీ నాయకురాలు విజయారెడ్డి మాట్లాడుతూ, అన్ని ఆటంకాలు తొలగిపోవాలని గణనాథుడిని పూజించానని తెలిపారు. జగనన్న నాయకత్వంలో, వైయస్ఆర్ ఆశయాల సాధనకు ముందుకు వెళ్తామన్నారు. గురువారం సాయంత్రం 6.30 గంటలకు రాజ్దూత్ చౌరస్తా వద్దకు చేరుకున్న విజయమ్మకు స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.
అక్కడి నుంచి వినాయకుడి వద్దకు బయల్దేరిన విజయమ్మ వెంట అభిమానులు కదులుతూ ‘వైయస్ఆర్ అమర్ రహే... జగన్ నాయకత్వం వర్ధిల్లాలి’ అంటూ నినదించారు. వినాయకుని దర్శించుకుని, పూజలు నిర్వహించిన అనంతరం ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ విజయమ్మను శాలువాతో సత్కరించి, వినాయకుని చిత్రపటాన్ని బహూకరించారు. అనంతరం విజయారెడ్డి, జేఏసీ నాయకుడు చందు శాలువాలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పుత్తా ప్రతాపరెడ్డి, ఆదం విజయకుమార్, శివకుమార్, వాసిరెడ్డి పద్మ, పెరిక సురేష్, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, స్థానిక నాయకుడు కమ్మరి వినయ్, కమ్మరి వెంకటేష్, శ్రీనివాస్యాదవ్, సత్యనారాయణ, బండిరాజు పాల్గొన్నారు.