'ప్రజా కంటక పాలనకు ఉద్వాసన చెబుదాం'

17 Jan, 2013 14:02 IST
తిరుపతి : కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ప్రజల సమన్యలను పట్టించుకోవడం లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి దుయ్యబట్టారు. కేవలం కుర్చీలు కాపాడుకోవడమే కాంగ్రెస్‌ పార్టీ వారికి ముఖ్యమని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజాకంటక పాలన సాగిస్తున్న ఈ ప్రభుత్వాన్ని పడగొట్టి సువర్ణ పరిపాలనను తీసుకురావడం ప్రజల చేతుల్లోనే ఉందని ఆయన పేర్కొన్నారు. తిరుపతి పల్లెవీధిలో బుధవారం నిర్వహించిన ప్రజాబాట కార్యక్రమంలో భూమన ప్రజలతో మాట్లాడారు. మనకూ ఒక కాలం వస్తుందని, అంతవరకు ఓపిక పట్టాలని అన్నారు.

ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను ఎమ్మెల్యే భూమన దృష్టికి తెచ్చారు. వారి సమస్యలను ఓపికగా విన్న ఎమ్యెల్యే వారిని ఊరడిస్తూ శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని, అంతవరకు ఓపిక పట్టాలని కోరారు. తిరుపతి నగరంలో సందుల్లోనే సమస్యలు అనేకం ఉన్నాయని, ప్రభుత్వం నిధులివ్వకుండా కక్ష సాధిస్తోందని ఆరోపించారు. తిరుపతి అభివృద్ధికి కోట్లాది రూపాయలు నిధులిస్తానని ముఖ్యమంత్రి గతంలో ఇచ్చిన హామీలన్నీ గాలిలో కలిసిపోయాయని భూమన విమర్శించారు.