- విజయవంతంగా వైయస్ జగన్ పాదయాత్ర
- రాజన్న బిడ్డ కోసం ఎదురు చూస్తున్న ప్రజలు
- ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం చేసేందుకు వైయస్ఆర్సీపీ శ్రేణులు సిద్ధం
అమరావతి: రాష్ట్రంలో పెరుగుతున్న అవినీతి.. అధికార పార్టీ నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా వైయస్ఆర్ సీపీ జాతీయ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. గతేడాది నవంబర్ 6న ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన వైయస్ జగన్ పాదయాత్ర వైయస్ఆర్ జిల్లా, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పూర్తి అయ్యింది. ఈ నెల 14 నుంచి కృష్ణా జిల్లాలో యాత్ర ప్రవేశిస్తుంది. జిల్లాలో 20 రోజులకుపైగా కొనసాగే ఈ పాదయాత్రలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు జిల్లా స్థాయి నేతలు, నియోజకవర్గ సమన్వయకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలోని మూడు నియోజకవర్గాలతో పాటు జిల్లాలోని మిగిలిన నియోజవర్గాల్లో పాదయాత్ర చురుగ్గా సాగేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
జననేత కోసం ఎదురుచూపులు
ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్రగా వస్తున్న వైయస్ జగన్ కోసం కృష్ణా జిల్లా ప్రజలు, పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నారు. వైయస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 14న గుంటూరు జిల్లా నుంచి వారధి మీదుగా కృష్ణా జిల్లాలోకి ప్రవేశిస్తారు. అక్కడ నుంచి విజయవాడ నగరం మీదుగా మొదలయ్యే పాదయాత్ర తొలివారం షెడ్యూల్ నూజివీడు నియోజకవర్గం వరకు కొనసాగుతుంది. జిల్లాలో నెలకొన్న సమస్యలు, ప్రభుత్వ పెద్దల పక్షపాత ధోరణిని ఎండగట్టేందుకు పార్టీ నాయకులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పాదయాత్ర, బహిరంగ సభలు, వైయస్ జగన్మోహన్రెడ్డి విడిది తదితర ఏర్పాట్లలో జిల్లా స్థాయి నాయకులు నిమగ్నమయ్యారు. కృష్ణా జిల్లా పార్టీ పరిశీలకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాదయాత్ర విజయవంతం చేయాలని నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు పిలుపునిచ్చారు..