కృష్ణాజిల్లా ప్రజా సంకల్పం సూపర్ సక్సెస్

12 May, 2018 17:03 IST

వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర కృష్ణాజిల్లాలో ఆరంభం అయ్యింది మొదలు రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఒక్కసారగా వేడిక్కినట్టు అయ్యాయి. అధికార పార్టీ కంచుకోటగా భావిస్తూ, ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్న రాజధాని నగరిలో ప్రతిపక్ష నేత అడుగులు ప్రత్యర్థుల గుండెల్లో ఫిరంగులై పేలాయి. అభివృద్ధి, సాంకేతక ప్రగతి, సంతృప్తస్థాయిలు, ఆనంద నగరాలు అంటూ అబద్ధాలతో మభ్యపుస్తూ వచ్చిన ప్రభుత్వం, ప్రజాసంకల్ప యాత్రికుడికి కృష్ణాజిల్లా ప్రజలు పట్టే బ్రహ్మరథాన్ని చూసి మతితప్పి, గతి మార్చుకుంటోంది. పెద్ద సంఖ్యలో ఈ జిల్లా టిడిపి నేతలు వైయస్ ఆర్  కాంగ్రెస్ పార్టీలో చేరడం, అభివృద్ధి అంటూ చంద్రబాబు చెప్పే అబద్ధాల ముసుగు తీసి, ప్రజలు తమ కష్టాలను, ఈ ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలను నాయకుడి ముందు  బైట పెట్టడం చూస్తే వాస్తవాలేమిటో సులువుగా అర్థం అవుతాయి. చంద్రబాబు సర్కారు నాలుగేళ్లు చెబుతున్నవన్నీ కల్లబొల్లి మాటలే అని రాజధాని జిల్లాల్లో, ప్రభుత్వ యంత్రాగం, ముఖమంత్రి నివాసం ఉన్న జిల్లాలో నేరాలు, ఘోరాలకు అడ్డూ అదుపు లేకుండా ఉందని కృష్ణాజిల్లా వాసులు ఆక్రోశిస్తున్నారు. అధికార పార్టీ నేతలు ఈ జిల్లాను ఎలా దోచుకుంటున్నారో అడుగడుగునా ప్రతిపక్ష నేతకు వివరిస్తున్నారు.

కృష్ణవేణి సాక్షిగా జన బావుటా

విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధి నుండి, ప్రకాశం బ్యారేజీపై యువనేత నడిచి వచ్చే దృశ్యం రాష్ట్ర ప్రజల గుండెల్లో మరచిపోలేని గురుతుగా ఉండిపోతుందనడంలో సందేహం లేదు. వారధి కింద కృష్ణమ్మ ఉప్పొంగి పారుతోందేమో అన్నట్టు సాగిన ఆ మహా యాత్ర ప్రజా సంకల్పయాత్రకు ఓ కొత్త ఒరవడిని తెచ్చింది. టిడిపి కంచు కోట కృష్ణాజిల్లా అనే భ్రమలు ఎవరికైనా ఉంటే వాటిని ప్రజా సంకల్ప యాత్ర తుడిచిపెట్టేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నమ్మి, ఆ జెండాను చేత పట్టుకుని, ఆ యువనేత అడుగులో అడుగు కదిపేందుకు కదం తొక్కిన ప్రజా శ్రేణిని చూసి ప్రభుత్వం కళ్లు పచ్చబడ్డాయి. జననేతకు అఖండ స్వాగతాంజలి పలికిన కృష్ణాజిల్లా అతడిని గుండెల్లో పెట్టుకుందనడానికి ఇంతకు మించిన సాక్ష్యాలేం కావాలి?

కృష్ణావాసుల కడగళ్లు

పేరుకే రాజధాని నగరి. ఊళ్లు చూడబోతే రాక్షస పాలనలో బందీ అయి ఉన్నాయి అంటున్నారు కృష్ణాతీర ప్రజలు. రాజధాని రాబోతోందని కలలు కన్న ఈ జిల్లా వాసులకు చంద్రబాబు చూపించింది బాహుబలిగ్రాఫిక్స్ మాత్రమే. కృష్ణానదిని ఆక్రమించుకుని, చేపల వేట చేసుకునేవారిని బెదిరిస్తూ, ఇష్టారాజ్యంగా నదిలో ఇళ్లు కట్టుకుని, ముఖ్యమంత్రి సైతం కరకట్టను ఆక్రమించుకుని అరాచక పాలనను కొనసాగిస్తున్నారని వైఎస్ జగన్ కు వివరించారు. ఇసుక, మట్టి అక్రమంగా తవ్వుకు పోతున్నారని, తీర ప్రాంతంలో తిరిగేందుకు కూడా నేతలు, వారి అనుచరులు సాధారణ ప్రజలను అనుమతించడం లేదని వాపోయారు. జిల్లాలో చిన్న చెరువులు, కుంటలను కూడా వదలకుండా తవ్వేసి, ఇసుకమట్టి అమ్మేస్తున్నారని వాపోతున్నారు. కృష్ణమ్మ చెంతనే ఉన్నా తాగేందుకు గుక్కెడు నీళ్లుండటం లేదని, మంచినీళ్లను భోజనం ఖరీదు పెట్టి కొనే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసారు. రాజధాని నిర్మాణం జరుగుతుందని, ఉద్యోగాలు, ఉపాధి దొరుకుతాయని ఎదురు చూసిన ఈ జిల్లా యువతకు తీవ్ర నిరాశే ప్రతిఫలంగా దక్కిందని, ఇదంతా చంద్రబాబు చేసిన మోసమే అంటూ ఆగ్రహించారు. గన్నవరం ఎయిర్ పోర్టును అభివృద్ధి చేస్తామన్నారని, బందరు పోర్టు ప్రారంభిస్తామని చెప్పారని, ఇళ్లు కట్టిస్తామన్నారని ఇందులో ఏ ఒక్కటీ కూడా నెరవేర్చకుండా ప్రజలంతా నా పాలనలో సంతోషంగా, సంతృప్తిగా ఉన్నారని అనడం విడ్డూరంగా ఉందంటున్నారు కృష్ణాజిల్లా ప్రాంత ప్రజలు. ప్రభుత్వం, పాలనా శాఖలు, ముఖ్యమంత్రి, అధికారులు, రాజధాని ఇన్ని ఉన్న ఈ జిల్లా పరిస్థితే ఇంత అధ్వాన్నంగా ఉంటే రాష్ట్రంలో మిగిలిన జిల్లాల పరిస్థితి ఎలా ఉంటుందో మాకు తెలుస్తోందని అన్నారు.

కృష్ణాజిల్లాకు అన్నగారి పేరు

ఆంధ్రుల అభిమాన నటుడు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సువర్ణాధ్యాయం లిఖించిన వ్యక్తి, టిడిపి ని స్థాపించి తెలుగు వాడి సత్తాను ఢిల్లీ పీఠానికి తెలియజెప్పిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరును కృష్ణాజిల్లాకు పెట్టాలని సంకల్పించారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. కృష్ణాజిల్లా పాదయాత్రలో భాగంగా ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు వెళ్లిన యువనేత ఆ గ్రామ ప్రజల సమస్యలను విని, అక్కడే  ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అధికారంలో ఉన్న చంద్రబాబు గతంలో ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ఆయన స్థాపించిన పార్టీని ఆక్రమించుకున్నాడని, నేడు ప్రజలను వంచించి పీఠం ఎక్కి అవినీతి చక్రవర్తి అవతారం ఎత్తాడని విమర్శించారు నిమ్మకూరు వాసులు. నందమూరి కుటుంబీకులు సైతం చంద్రబాబు నీచత్వాన్ని ఎండగట్టారు. జిల్లాకు ఎన్టీఆర్ పేరు అని ప్రకటించగానే నిమ్మకూరు మాత్రమే కాదు, యావత్ ఆంధ్రరాష్ట్రం ఈర్షావేశాలు లేని, విలువలున్న రాజకీయవేత్తను చూసి గర్వించింది. ప్రతిపక్ష నేత అయ్యుండి అధికార పక్షానికి చెందిన ప్రముఖుని గౌరవించేందుకు ఇంత గొప్ప నిర్ణయం తీసుకోవడం రాజకీయాల్లో ఓ మేలి మలుపు.

యువనేతకు జై కొట్టిన తెలుగు తమ్ముళ్లు

వైఎస్సార్ ప్రభంజనాన్ని తిరిగి తెచ్చిన ఘనుడు వైఎస్ జగన్. ప్రజల గుండెల్లో తిరుగులేని నాయకుడైన ఒకే ఒక్కడు వైఎస్ జగన్. కష్టాలను, ఎదురుదెబ్బలను ఎదిరించి ఒంటరి పోరుతో ప్రజల మనసులు గెలిచిన నిజమైన నాయకుడంటే వైఎస్ జగనే. అతడి చొరవ, తెగువ, అతడి వెన్నంటి నడిచే ప్రజల విలువ తెలుసుకున్న నాయకులు వైఎస్ జగన్ వెంట నడుస్తున్నారు. ప్రలోభాలను లెక్కచేయకుండా, అధికార పార్టీ ఆంక్షలను ఖాతరు చేయకుండా యువనేతకు మద్దతు పలుకుతున్నారు. యలమంచిలి రవి, నిమ్మకాయల రాజనారాయణ, ఆతుకూరి నాగేశ్వరరావు, వసంత కృష్ణప్రసాద్ మొదలైన టిడిపి సీనియర్ నేతలు ఆ పార్టీని వదిలి వైఎస్ జగన్ వెంట నడిచేందుకు సిద్ధమయ్యారు.  ప్రత్యర్థులను సైతం తన బాటలో నడిపించుకోగల సిద్ధాంతం వైఎస్ జగన్ సొంతం. అందుకే కృష్ణా నేతలంతా యువనేత వెనుక అడుగులేస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్ నిర్మాణం వైఎస్ జగన్ తోనే సాధ్యం అని నమ్ముతున్నారు. రాయలసీమ జిల్లాల్లో ప్రజా సంకల్ప పాదయాత్ర అక్కడి ప్రజల ఆవేదనలకు అద్దం పడితే, కృష్ణాతీరంలో ప్రజా సంకల్పం ఆ ప్రాంత ప్రజల మనోవేదనను ప్రతిఫలించింది. ప్రతిపక్ష నాయకుడి రాక ఆ జిల్లాలో కొత్త ధైర్యానికి, కొత్త ఆశలకు ఊపిరి పోసింది. కృష్ణాజిల్లా ప్రజా సంకల్ప యాత్ర చంద్రబాబు ప్రభుత్వం ఆడుతున్న అబద్ధాల నాటకానికి తెరదించింది. వాస్తవాలను కళ్లముందుకు తెచ్చింది.