చిత్తూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ఈ నెల 25వ తేదీ నుంచి చిత్తూరు జిల్లాలో ప్రారంభమవుతుందని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వైయస్ జగన్ పాదయాత్రపై శనివారం తిరుపతిలో పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..నవంబర్ 6వ తేదీ వైయస్ఆర్ జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన వైయస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర దిగ్విజయంగా సాగుతుందన్నారు. వైయస్ఆర్ జిల్లా, కర్నూలు జిల్లాల్లో పాదయాత్ర పూరై్త అనంతపురం జిల్లాలో కొనసాగుతుందన్నారు. అనంతపురం జిల్లా నుంచి వైయస్ జగన్ పాదయాత్ర చిత్తూరు జిల్లాకు ఈ నెల 25వ తేదీ ప్రవేశిస్తుందన్నారు. 10 నియోజకవర్గాల్లో 17 రోజుల పాటు జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర సాగుతుందని వివరించారు.
పవన్ ప్రశ్నించాల్సిన వారిని ప్రశ్నంచడం లేదు..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించాల్సిన ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదని వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. నాలుగేళ్ల టీడీపీ పాలనలో అవినీతి విచ్చలవిడిగా సాగుతుందని, ఇన్నాళ్లు నోరు మెదపని పవన్ కళ్యాణ్ చంద్రబాబును పోలవరం అవినీతి నుంచి కాపాడేందుకు ప్రతిపక్ష నేతపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం దోపిడీని కేంద్రం గుర్తించిందని, టెండర్లలో గోలుమాలు జరిగిందని తెలిపారు. ఇదే విషయం తాము పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన సమయంలో వెల్లడైనట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని తెలిపారు. సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్రెడ్డి, రోజా, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, నారాయణస్వామి, రామచంద్రారెడ్డి, సునీల్, అమర్నాథ్రెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.