పోలవరం ప్రాజెక్టుకు మరికొంత సమయం కావాలి : కేంద్రమంత్రి ఉమా భారతి
3 Apr, 2016 15:15 IST
పోలవరం ఈ ఒక్క పేరు చాలు ఏళ్ల తరబడి పెండంగ్లో ఉన్న ప్రాజెక్టు అని చిన్నపిల్లాడి నుంచి పండు ముసలివాడి వరకు చెబుతారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యితే కొన్ని లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయని అందరికీ తెలుసు. కానీ ఆ ప్రాజెక్టును మాత్రం పూర్తి చేయడానికి ఎన్నో అడ్డంకులు. ఆ అడ్డంకులను ఎదుర్కొని ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఎన్నికలకు ముందు అటు బీజేపీ... ఇటు టీడీపీ ప్రభుత్వాలు హామీ ఇచ్చాయి. ఇప్పుడు ఆ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్న ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది పరిస్థితి.
పోలవరం ప్రాజెక్టు గడువులోగా పూర్తికాదు: కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి
పోలవరం ప్రాజెక్టు గడువులోగా పూర్తికాదని స్వయంగా కేంద్ర జలవనరుల శాఖమంత్రి ఉమాభారతి మీడియాకు వివరించారు. పోలవరానికి కొంత కాలపరిమితి పెంచాలని, ప్రాజెక్టు నిర్మాణానికి ఆధారిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కార్యాచరణ, ప్రణాళికలను చర్చించడానికి ఢిల్లీకి రావాల్సిందిగా ఏపీ సీఎం చంద్రబాబుకు తెలిపామని, సీఎంతో చర్చించి ప్రాజెక్టుకు కొత్త కాలపరిమితిని నిర్ధారిస్తామని పేర్కొన్నారు. ప్రాజెక్టుకు నిధుల కొరత లేదని, ఈ ప్రాజెక్టుకు రూ. 200 కోట్లు అందించామని, ఇప్పటికి రూ. 500 కోట్లు విడుదల చేశామని, ఈ నిధులు సరిపోవని ప్రాజెక్టుకు రూ. 1,600 కోట్లు విడుదల చేయాలని నీతి ఆయోగ్ను కోరామన్నారు.