హైదరాబాద్ః రోజాను సభలోకి అనుమతించకపోవడంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిన ఏపీ సీఎం చంద్రబాబు, స్పీకర్ కోడెల శివప్రసాదరావులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని న్యాయవాది గోపాలకృష్ణ కోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. రోజాను ఏడాదిపాటు సస్పెండ్ చేసే అధికారం అసెంబ్లీకి లేదని హైకోర్టు స్టే ఇస్తూ..ఆమె సభకు వెళ్లేందుకు ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఐతే, కోర్టు ఆదేశాలను కూడా టీడీపీ ప్రభుత్వం ధిక్కరించింది. ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి, సభాపతిలపై క్రిమినల్ చర్యలకు గోపాలకృష్ణ కోర్టులో పిల్ వేశారు.
అంతకుముందు సుప్రీంకోర్టు కూడా రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోందని సీరియస్ అయ్యింది. సుప్రీం ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన హైకోర్టు రోజా సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సభకు వెళ్లేందుకు రోజాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ, ప్రభుత్వం, సభాపతి, అసెంబ్లీ కార్యదర్శి, చీఫ్ మార్షల్ రోజాను సభలోకి రానీయకుండా న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించారు. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు.