సమస్యలపై తమ్ముళ్లను నిలదీస్తున్న ప్రజలు

4 Dec, 2015 16:44 IST
జనచైతన్య యాత్రల పేరుతో ఊళ్లు తిరుగుతున్న టీడీపీ నేతలను ఎక్కడిక్కడ ప్రజలు అడ్డుకుంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై నిలదీస్తున్నారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరయినా ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా మళ్లీ ఎవర్ని మోసగించడానికి వచ్చారంటూ ప్రజలు పచ్చనేతలపై తిరగబడుతున్నారు. చేయని పనులను చేసినట్టు ప్రచారం నిర్వహిస్తుండడంపై మండిపడుతున్నారు. హామీలు నెరవేర్చాకే తమ గ్రామాల్లో అడుగుపెట్టాలని పచ్చచొక్కాలను ప్రజలు తరిమికొడుతున్నారు. దీంతో, ఏం చెప్పాలో తెలియక తమ్ముళ్లు బిక్కముఖమేస్తున్నారు.

ఎన్నికల ముందు రుణాల మాఫీ, ఉద్యోగాలు, నిరుద్యోగభృతి సహా వందలాది వాగ్దానాలు ఇచ్చిన చంద్రబాబు అమలుచేయకుండా ప్రజలను మభ్యపెడుతూ వస్తున్నారు. చేసిన మోసాలను కప్పిపుచ్చుకునేందుకు యాత్రలు చేస్తున్నారు. రైతులు, మహిళలు, వృద్ధులు, దళితులు, యువత అంతా తమ సమస్యలపై తెలుగుతమ్ముళ్లను నిలదీస్తుండడంతో సమాధానం చెప్పుకోలేక నీళ్లు మింగుతున్నారు.