- వైయస్ జగన్కు దారిపొడవునా సమస్యలు చెప్పుకుంటున్న ప్రజలు
– అనంతపురం జిల్లాలో దిగ్విజయంగా జననేత పాదయాత్ర
అనంతపురం: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర అనంతపురం జిల్లాలో దిగ్విజయంగా సాగుతోంది. రాజన్న బిడ్డకు జనం నీరాజనాలు పలుకుతున్నారు. ప్రజా సంకల్ప యాత్ర సాగుతున్న ఊర్లలో పండుగ వాతావరణం నెలకొంది. వేలాది మంది జననేత అడుగులో అడుగు వేస్తూ పాదయాత్రకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. మంగళవారం 44వ రోజు ప్రజా సంకల్ప యాత్ర అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోని గాండ్లపెంట నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి వేపరాళ్ల క్రాస్, తాళ్ల కాల్వ, రెక్క మాను మీదుగా 10 గంటలకు గాజులవారిపల్లె చేరుకున్నారు. ప్రస్తుతం ధనియని చెరువులో వైయస్ జగన్ పాదయాత్ర కొనసాగుతోంది.
అడుగడుగునా బ్రహ్మరథం..
వైయస్ జగన్ పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. జననేత వస్తున్నారని ప్రజలు పనులు మానుకొని ఎదురెళ్లి స్వాగతం పలుకుతున్నారు. పాదయాత్ర ప్రారంభమవగానే వివిధ వర్గాల ప్రజలు తరలి వచ్చి వెంట నడుస్తున్నారు. మంగళవారం ఉదయం కదిరి నియోజకవర్గం తాళ్లకాల్వ వద్దకు వైయస్ జగన్ చేరుకోగానే పింఛన్ ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వృద్ధులు ఆయనకు వివరించారు. వేలిముద్రలు పడటం లేదని ఓ వృద్ధ దంపతులు తెలిపారు. కొడుకులు పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం ఇచ్చే పింఛన్ మాత్రలకు సరిపోవడం లేదని చెప్పారు. ఎలా బతకాలని జననేత దృష్టికి తీసుకెళ్లారు. వైయస్ జగన్ను పలువురు కలిసి తమ గోడు చెప్పుకున్నారు. అధికారంలోకి వచ్చాక పింఛన్ రూ.2 వేలు చేస్తామని, ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదని వైయస్ జగన్ భరోసా కల్పించారు. రుణమాఫీ కాలేదని ఓ మహిళా రైతు పేర్కొంది. నాకు ఐదు ఎకరాల పొలం ఉందని, ఒక్క రూపాయి కూడా రుణం మాఫీ కాలేదని వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఇలా దారి పొడవునా సమస్యలను ఏకరువుపెట్టారు. నర్సరీల యజమానులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు వైయస్ జగన్ను కలసి తమ సమస్యలను వివరించారు. అందరి సమస్యలు ఓపికగా విన్న వైయస్ జగన్.. మన ప్రభుత్వం వచ్చాక అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తామని భరోసా కల్పించారు.