పెంచిన ఆర్టీసీ ఛార్జీలు వెంటనే తగ్గించాలి
24 Sep, 2012 06:26 IST
హైదరాబాద్, 24 సెప్టెంబర్ 2012: రాష్ట్రప్రభుత్వం పెంచిన విద్యుత్ సర్ఛార్జీలను, ఆర్టీసీ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జి. శ్రీకాంత్రెడ్డి డిమాండ్ చేశారు. డిమాండ్ను బట్టి ప్రభుత్వ సర్ఛార్జీలు వసూలు చేయాలని ఆలోచించడం సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. ప్రభుత్వం నిర్ణయంతో పేదలు, సామాన్యులపై మోయలేని ఆర్థిక భారం పడుతుందన్నారు. వ్యవసాయానికి ఏడు గంటలు విద్యుత్ సరఫరా చేస్తామన్న ప్రభుత్వ హామీ రాష్ట్రంలో ఎక్కడా, ఏ కోశానా అమలు కావడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా లేక పంట ఎండిపోయిన ఒక్క ఎకరం భూమినైనా చూపించమని కాంగ్రెస్ నాయకులు అటున్నారని, అయితే, రాష్ట్రవ్యాప్తంగా అలా ఎండిపోయిన వందల ఎకరాలను సీఎంకు చూపిస్తామని శ్రీకాంత్రెడ్డి అన్నారు.