కక్షసాధింపుతోనే ఇదంతా చేస్తున్నారు

16 Nov, 2015 18:27 IST
వైఎస్సార్సీపీ నేత పార్థసారధి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. పార్టీ మీద, కొడాలి నాని మీద వ్యక్తిగత కక్షతో చంద్రబాబు పోలీసుల్ని బెదిరించి అక్రమ కేసులు బనాయించడం దారుణమన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జంగిల్ రాజ్యం పాలన కొనసాగుతుందని మండిపడ్డారు. అధికారులు, పోలీసులు ప్రభుత్వానికి తలొగ్గి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. 

ఓ సివిల్ కేసుకు సంబంధించిన విషయంలో పోలీసులు తలదూర్చడమేంటని పార్థసారధి ప్రశ్నించారు. కొడాలి నాని నడుపుతున్న బిల్డింగ్ విషయానికి సంబంధించి ఎలాంటి కేసు లేకున్నా...కావాలనే పచ్చనేతలు కుట్రపన్ని అరెస్ట్ చేశారన్నారు. అరెస్ట్ కు కారణం తెలపకుండానే కనీసం గౌరవశాసనసభ్యుడని కూడా చూడకుండా పోలీసులు అమానుషంగా ప్రవర్తించారన్నారు. 

 144 సెక్షన్ విధించి మరీ అక్కడకు వచ్చిన వారందరినీ అరెస్ట్ చేశారని పార్థసారధి ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్రభుత్వ దుశ్చర్యను వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు.  లీగల్ గా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో ఆలోచన చేస్తామని పార్థసారధి తెలిపారు. పోలీసు సిబ్బందిని మోహరించిన తీరుపట్ల విచారించి దోషుల్ని బాధ్యుల్ని చేసి కఠినంగా శిక్షించాలని డీజీపీని డిమాండ్ చేశారు.