తిరుపతి, 12 నవంబర్ 2013: రచ్చబండ కార్యక్రమం పేరు చెప్పి ప్రజలను మరోసారి మోసం చేసేందుకు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సిద్ధమయ్యారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి ఆరోపించారు. తిరుపతిలో ఆయన మంగళవారం మాట్లాడుతూ.. సమైక్యాంధ్ర ముసుగులో ఇంతకు ముందు విభజనను వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించిన సీఎం ఇప్పుడు విభజిస్తే ప్యాకేజీలు కావాలని డిమాండ్ చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన రీతిలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతారని భూమన కరుణాకరరెడ్డి తెలిపారు.
కిరణ్ కుమార్రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో మూడవ విడత రచ్చబండ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్నది. ఈ నేపథ్యంలో సీమాంధ్ర ప్రజల దృష్టిని మరల్చేందుకే రచ్చబండ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్నదన్న ఆరోపణలు వస్తున్నాయి.