వెనుదిరిగేది లేదన్న వైయస్సార్సీపీ నేతలు
కోరుకొండ: రాజమండ్రిలో వైయస్సార్సీపీ సీనియర్ నేతల్ని అరెస్టు చేయటంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. తుని ఘటనలో అరెస్టు చేసినవారిని విడుదల చేయాలంటూ ఆమరణ దీక్ష చేస్తున్న ముద్రగడను చూసేందుకు పార్టీ నాయకులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సామినేని ఉదయభాను హైదరాబాద్ నుంచి విమానంలో వెళ్లారు. అయితే వారిని విమానాశ్రయం వద్దే అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కోరుకొండ పోలీసు స్టేషన్కు తరలించారు.అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోవాలని నేతలకు పోలీసులు చెప్పగా.. ముద్రగడను చూసే వరకు తాము వెళ్లేది లేదని వైఎస్ఆర్సీపీ నేతలు తేల్చిచెప్పారు. అయితే.. ముద్రగడను చూసేందుకు కుదరదని పోలీసు అధికారులు చెప్పడంపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వ దమనకాండకు వ్యతిరేకంగా తాము ముద్రగడను పరామర్శించాకే వెళతామని స్పష్టం చేశారు.