విజయవాడ: ఒక పక్క కృష్ణా నది మీద తెలంగాణ వరుసగా ఎత్తిపోతల పథకాల్ని కడుతుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ ప్రశ్నించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల వల్ల 150 టీఎంసీల కృష్ణా జలాలను తెలంగాణ తరలించుకుపోతుందని విమర్శించారు. కృష్ణా డెల్టాను ఎడారిగా చేసే తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడంలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారని ఆరోపించారు. ఓటుకు కోట్లు కేసుతో కేసీఆర్ చంద్రబాబును తరిమికొట్టారన్నారు. ఈ ప్రాజెక్టులపై చంద్రబాబు నోరు మెదపడం లేదని విమర్శించారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పెద్ద దద్దమ్మ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రెస్మీట్లు పెట్టి సొళ్లు కబుర్లు చెబుతారు కానీ.. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై మాత్రం స్పందించడంటూ విమర్శించారు. ఈ ప్రాజెక్టులను వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తుందని జోగి రమేష్ స్పష్టం చేశారు. చంద్రబాబు గంగిరెద్దులా మారారని ఎద్దేవా చేశారు. ఈ రెండు ప్రాజెక్టులపై కేంద్రం, కృష్ణా బోర్డు వద్ద ఎందుకు ఫిర్యాదు చేయలేదని జోగి రమేష్ ప్రశ్నించారు.