అర్హులైన లబ్దిదారులకు అన్యాయం కూడదు-ఎంపీ మేకపాటి
20 Apr, 2016 07:38 IST
నెల్లూరు: కేంద్ర ప్రభుత్వ పథకాలు అర్హులైన లబ్దిదారులకు అన్యాయం జరగనివ్వకుండా చూడాలని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అభిప్రాయ పడ్డారు. స్థానిక గోల్డెన్ జూబ్లీ హాల్ లో నిర్వహించిన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఎంపీ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలవుతున్న పథకాలు అర్హులకు అందడం లేదన్నారు. జన్మభూమి కమిటీల పెత్తనం లేకుండా ఉత్తర్వులు వచ్చేలా పార్లమెంట్లో చర్చిస్తానన్నారు.అధికారులు నిస్పక్షపాతంగా వ్యవ హరించి పింఛన్లు, తదితర పథకాలు అందేలా చూడాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై జిల్లాలో ప్రొటోకాల్ విషయంలో ప్రజాప్రతినిధులకు అవమానం జరుగుతోందని, అధికారులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. స్వయంగా తనను ప్రారంభోత్సవానికి ఆహ్వానించి శిలాఫలకంపై పేరు లేకుండా చేశారన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య తదితరులు పాల్గొన్నారు.