సిగ్గూ,శరం ఉన్న వారెవరైనా అలా చేస్తారా

19 Apr, 2016 15:07 IST
చంద్రబాబు ప్రతి దానిని డబ్బుతోనే చూస్తున్నాడు
ఆఖరికి కరువును కూడా వాడుకుంటున్నారు
హేరిటెజ్ పాలు, పెరుగు అమ్ముకునేందుకే లోకేష్ మజ్జిగ స్రవంతి
ప్రజలు కరువుతో అల్లాడుతుంటే ర్యాంకులా
మీ పేపర్లు మీరే దిద్దుకోవడం కాదు బాబు ప్రజలు దిద్దాలి
వేలంపాటలో ఎమ్మెల్యేలను కొనే దౌర్భాగ్య రాజకీయం 
బాబుకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారుః అంబటి రాంబాబు

హైదరాబాద్ః రాష్ట్రంలో ప్రజలు కరువు కాటకాలతో అల్లాడుతుంటే..నీళ్లివ్వడం మానేసి బాబు మంత్రులకు ర్యాంకులిచ్చుకోవడం సిగ్గుచేటని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. అవినీతిలో ఆరితేరారని ర్యాంకులిస్తున్నారా...దేనికి బాబు ర్యాంకులని నిప్పులు చెరిగారు. మీ పాలనపై ప్రజలు ర్యాంకులివ్వాలని గానీ...మీ పేపర్లు మీరే దిద్దుకొని ర్యాంకులిచ్చుకోవడం కాదని హితవు పలికారు. అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనడంపై ఉన్న ధ్యాస... బాబుకు ప్రజాసమస్యలపై లేకపోవడం దురదృష్టకరమన్నారు. 

లోటస్ పాండ్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడారు. రాష్ట్రంలో కరువు, వర్షాభావ పరిస్థితులపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆశాజనకంగా లేకపోగా తీవ్ర నిరాశ మిగిల్చాయని అన్నారు. చంద్రబాబు ప్రతి పనిని డబ్బులతోనే చూస్తున్నారని అంబటి మండిపడ్డారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రతి సంక్షోభాన్ని, అవకాశాన్ని చంద్రబాబు తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారని, ఆఖరికి కరువును కూడా సొంత ప్రయోజనాలకు వాడుకోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజ చేసిన ఐదు సంతకాల్లో ఒకటైనా.. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకానికే దిక్కులేకుండా పోయిందని అంబటి అన్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి గాలికిపోయి...లోకేష్ మజ్జిగ స్రవంతి పథకం వచ్చిందని చురక అంటించారు. హెరిటేజ్ పాలు, పెరుగు అమ్ముకునేందుకే, చంద్రబాబు లోకేష్ మజ్జిగ స్రవంతి పథకాన్ని తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. మంచినీటి పంపులను బాగుచేయడం కోసమే బాబు రూ.200కోట్లు అంటున్నారని చెప్పారు. దాహం వేసినప్పుడు బావు తవ్వినట్టు ...రక్షిత నీటి పథకాలకు ఇవాళ మరమ్మతులు చేయడంలో మీ ఉద్దేశ్యమేంటి బాబు...? రూ. 200 కోట్లను స్వాహా చేసేందుకు నిధులు కేటాయించినట్లుగా ఉంది తప్ప...ప్రజలకు తాగునీరు అందించాలన్న ఉద్దేశ్యం ఎక్కడ కనబడడం లేదని అంబటి తూర్పారబట్టారు. ఈమొత్తాన్ని మూన్నెళ్ల క్రితమే ఎందుకు ప్రకటించలేదని నిలదీశారు. సీఆర్డీఏ పరిధిలోని 29 గ్రామాల్లో ప్రజలు తీవ్ర నీటి ఎద్దడితో అవస్థలు పడుతున్నారని...కృష్ణానది ఉన్నచోటే పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే మిగతా ప్రాంతాల్లో మరెంత ఘోరంగా ఉంటుందో ఊహించుకోవచ్చన్నారు. 

 ఇటీవల చంద్రన్న కానుక పేరుతో ఏవిధంగా  పుచ్చిపోయిన శనగలు, పాడయిపోయిన హెరిటేజ్ నెయ్యి ఇచ్చారో...అదే మాదిరిగా మజ్జిగ పథకాన్నిరైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో పెట్టి బాబు గోల్ మాల్ చేస్తారని అంబటి అన్నారు. మంది సొమ్ము మజ్జిగ పాలు చేసినట్లు...మజ్జిగ పథకం పేరుతో చంద్రబాబు రూ. 39 కోట్లు కాజేయాలని చూస్తున్నారని విరుచుకుపడ్డారు.  తాగడానికి గుక్కెడు నీళ్లు లేక ప్రజలు అల్లాడుతుంటే... బాబు దాన్ని క్యాష్ చేసుకునేందుకు కోట్లాది రూపాయలు కాజేసే పనిలో ఉండడం సిగ్గుచేటన్నారు.  దీనిపై ప్రజలు ఆలోచన చేయాలన్నారు.

నాగార్జున సాగర్ నుంచి రాష్ట్రానికి రావాల్సిన 10 టీఎంసీల నీరు వదులుకునే దౌర్భాగ్య స్థితిలో చంద్రబాబు ఉండడం నీచమన్నారు. కేసీఆర్ తో తగాదాకు వెల్తే ఓటుకు కోట్లు ఛార్జిషీట్ బయటకు తీస్తారన్న భయంతో...బాబు ఏపీ ప్రజల భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారని ధ్వజమెత్తారు.  ఇదిలా ఉంటే సందట్లే సడేమియాలో పర్యావరణ ప్రాజెక్ట్ లకున్న  33 సంవత్సరాల లీజును 66 ఏళ్లు చేయడం దారుణమన్నారు.  అభివృద్ధి పేరుతో తన అనుయాయులకు లబ్ది చేకూర్చేందుకే బాబు ఇదంతా చేస్తున్నారని ఫైరయ్యారు. 

చంద్రబాబు నారాయణకు ఎక్కడో 18వ ర్యాంక్ ఇచ్చారట.  ఒకటో ర్యాంక్ ఒకటో ర్యాంక్ అంటూ  తన కాలేజీల్లో దులిపేసే నారాయణ ...ఇక నుంచి  నారాయణ ఆఖరి ర్యాంకు అని చెప్పుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. నచ్చినోళ్లకు ఒకటో ర్యాంకు, నచ్చనోళ్లకు చివరి ర్యాంకు ఇస్తున్నారా బాబు. మీరు ప్రకటించిన ర్యాంకులను మీ మంత్రులే పట్టించుకోవడం లేదు. ఏమిటీ తంతంగం బాబు. ఎందుకీ పనికిమాలిన కార్యక్రమాలని అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహించారు. 

బాబుకు ప్రత్యామ్నాయమే లేదని టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. మరి అలాంటప్పుడు ఎమ్మెల్యేలను ఎందుకు చేర్చుకుంటున్నారు. వారితో  రాజీనామా ఎందుకు చేయించడం లేదు. ప్రజల ముందుకు వచ్చి నిలబడేందుకు ఎందుకు ధైర్యం చాలడం లేదు. కోట్లు కుమ్మరించి ఎమ్మెల్యేలను తీసుకుంటున్నావ్. నీకు నిజంగా ప్రజలపై గౌరవముంటే రాజీనామా చేయించు.  నిలబెట్టి గెలిపించుకొని నంబర్ వన్ ర్యాంక్ సాధించుకోవాల్సిందిపోయి ఎందుకు  మొహం చాటేస్తున్నావ్ బాబు . పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలకు లీగల్ గా అన్ని రకాలుగా ప్రొసీడ్ అవుతామని అంబటి స్పష్టం చేశారు. చట్టం తని పని తాను చేసుకుపోకుండా స్పీకర్ వ్యవస్థ అడ్డుపడుతోందని...కానీ అంతమంగా ప్రజాస్వామ్యంలో చట్టమే గెలుస్తుందన్నారు. 

రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లు...గుక్కెడు నీళ్లు లేక రాష్ట్రం భగ్గుమంటుంటే బాబు ఎమ్మెల్యేలను ఎంతకు కొందాం, ఏవిధంగా కొందామని ఆలోచిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజల బాధలను పట్టించుకోకుండా ర్యాంకులు ప్రకటించడం దురదృష్టకర పరిణామం. ఎమ్మెల్యేలు అనైతికంగా, చట్టవ్యతిరేకంగా వెళ్లిపోతుంటే...వైఎస్ జగన్ ఎమ్మెల్యేలను నిలుపుకోలేకపోతున్నారంటూ కొన్ని పత్రికలు వార్తలు రాయడం దారుణమన్నారు. నిలుపుకోవడమంటే బాబు లాగా డబ్బులివ్వడమా మీ ఉద్దేశ్యమని అడిగారు.   

వేలంపాటలో  ఎమ్మెల్యేలను కొనుక్కోవాల్సిన దౌర్భాగ్యమైన రాజకీయాలు తీసుకొచ్చిన బాబుకు ప్రజలు బుద్దిచెబుతారని హెచ్చరించారు. బుద్ది జ్ఞానం ఉన్నవాళ్లు ఎవరైనా ప్రజాస్వామ్యంలో ఇలా అనైతికంగా ఎమ్మెల్యేలను కొంటారా. మాట్లాడితే  నీతి, నిజాయితీ, అవినీతి లేని పాలన అందిస్తున్నాని చెప్పుకునే వ్యక్తి...విజయవాడలో అఫిషియల్ బిల్డింగ్ లో పచ్చకండువాలు వేస్తారా. సిగ్గుండాలి అంటూ అంబటి విమర్శించారు.  నీతి, నిజాయితీ లేని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే దేశంలో అది ఒక్క బాబు మాత్రమేనన్నారు. ఎప్పటికైనా ప్రజాస్వామ్యంలో చట్టమే అంతిమంగా నిలబడుతోందని, చట్టప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎన్నికలు ఫేస్ చేయాల్సిందేనన్నారు. ఎమ్మెల్యేలను ఎందుకు తీసుకుంటున్నారని బాబు కోరితెచ్చుకున్న పవన్ కల్యాణ్ కుడా అన్నారని, ఐనా సిగ్గూ, శరం లేదని దుయ్యబట్టారు.