* దొంగ దారులు వెదకుతున్న ప్రభుత్వం
* విపక్షాల్ని దూషించేందుకు ప్రయత్నం
* అసెంబ్లీ స్థాయిని తగ్గిస్తున్న అధికార పార్టీ
హైదరాబాద్) అసెంబ్లీ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ ఒకే అజెండాతో వ్యవహరిస్తోంది. ప్రజా సమస్యల మీద ప్రశ్నించిన ప్రతీసారీ, ప్రతిపక్షాల్ని దూషించేందుకు ప్రయత్నిస్తోంది.
ప్రజాసమస్యల్ని ప్రస్తావిస్తున్న వైఎస్సార్సీపీ
పూర్తిగా ప్రజా సమస్యల్ని చర్చించాలంటే 15 రోజుల పాటు సమావేశాలు నడపాలని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ మొదటే కోరింది. అయినప్పటికీ అంగీకరించకుండా మొండిగా 5 రోజులే సభ నడపాలని నిర్ణయించింది. అయినా సరే, ప్రజా సమస్యల్ని ప్రస్తావించేందుకు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ అమితంగా శ్రమించింది. పదే పదే ప్రజా అంశాల్ని అసెంబ్లీలో లేవనెత్తి పరిష్కారం కోసం ప్రయత్నించింది. ప్రత్యేక హోదా, కరవు, పట్టి సీమ అక్రమాలు వంటి అంశాలపై సూటిగా స్పష్టంగా ప్రశ్నించింది.
దూషణే మార్గం
ప్రతిపక్షాల ప్రశ్నలకు జవాబులు ఇవ్వలేని ప్రభుత్వం దూషణ మార్గాన్ని ఎంచుకొంది. ప్రతిపక్ష పార్టీని సైకో పార్టీ గా అభివర్ణిస్తూ మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. దీని మీద ప్రతిపక్ష పార్టీలన్నీ అభ్యంతరం తెలిపాయి. అయినప్పటికీ ఏమాత్రం తగ్గకుండా అచ్చెన్నాయుడు అదే ధోరణి ని కొనసాగించారు. ప్రతిపక్షాల్ని తిట్టడం ద్వారా రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. తత్ఫలితంగా ప్రజాసమస్యల్ని పక్కన పెట్టేయాలని నిర్ణయించుకొన్నారు.
అధికార పార్టీ ధ్యేయం ఇది..!
ప్రతిపక్షాల్ని బాగా తిడితే ముఖ్యమంత్రి దగ్గర మార్కులు కొట్టేయాలన్నది కొందరు మంత్రులు ఆలోచన. ఇందుకు తగినట్లుగా అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద చర్చ జరుగుతున్న ప్రతీ సారి మధ్యలో జోక్యం చేసుకొని విపక్ష నేత ను, ప్రతిపక్ష పార్టీని దూషిస్తున్నారు. దీని మీద రచ్చ జరగాలని, ఫలితంగా ప్రజా సమస్యల మీద చర్చ జరగకుండా పక్కకు వెళ్లిపోవచ్చని భావిస్తున్నారు.