ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజిస్తే ఊరుకోం
18 ఆగస్టు 2013 : ఓట్లు- సీట్ల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే ఊరుకునేది లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పిఎసి సభ్యుడు డాక్టర్ ఎం.వి. మైసూరా హెచ్చరించారు. సమైక్యాంధ్ర ప్రకటన వచ్చే వరకూ వైయస్ఆర్ కాంగ్రెస్ పోరాటాలు ఆగబోవని ఆయన స్పష్టం చేశారు. రైల్వే కోడూరులో పార్టీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు దీక్షకు ఆదివారంనాడు సంఘీభావం తెలిపిన అనంతరం మైసూరారెడ్డి మీడియాతో మాట్లాడారు. కేవలం పది సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించిన ఘనత సోనియా గాంధీదే అని మైసూరారెడ్డి మండిపడ్డారు.
సొంత నియోజకవర్గంలో ఇక గెలిచే అవకాశాలు లేవని తన కుమారుడు రాహుల్ గాంధీ చేత మెదక్లో పోటీ చేయించేందుకు సోనియా గాంధీ యత్నిస్తున్నాని మైసూరారెడ్డి విమర్శించారు. అధికారం చేతిలో ఉంది కదా అని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులపై ఎస్మా ప్రయోగిస్తే భయపడేవారేవరూ లేరన్నారు. వైయస్ఆర్ జిల్లాకే చెందిన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి రాజంపేటలో చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు మైసూరా సంఘీభావం ప్రకటించారు.