విలువల్లేని రాజకీయాలు వద్దు..ఎంపీ వర ప్రసాద్

11 Apr, 2016 11:01 IST


నెల్లూరు) పార్టీ మారిన ఎమ్మెల్యేలు విలువల్లేని రాజకీయాలకు పాల్పడుతున్నారని తిరుపతి వైఎస్సార్సీపీ ఎంపీ వర ప్రసాద్ రావు అభిప్రాయపడ్డారు. ఇటువంటి పోకడలు సరికాదని ఆయన అన్నారు. నెల్లూరు జిల్లా వాకాడులో పార్టీ సీజీసీ సభ్యుడు డాక్టర్ నేదురుమిల్లి పద్మనాభ రెడ్డి నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కు సత్తా ఉంటే పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో గెలవాలని సూచించారు. పార్టీ నుంచి పిరికివాడిలా పారిపోవడం దారుణమన్నారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, కార్యకర్తలు కష్టపడి పనిచేస్తేనే తాను ఎంపీగా, సునీల్ గూడూరు ఎమ్మెల్యేగా గెలిచామని వివరించారు.ఆయన్ను మొదటిసారి ఎమ్మెల్యే చేసిన గూడూరు నియోజవర్గ ప్రజలకు జీవితాంతం దణ్ణం పెట్టుకోవాలని సూచించారు.

ఫిరాయింపులను చంద్రబాబు ప్రోత్సహించడం దారుణమన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షమే లేకుండా చేయాలని చంద్రబాబు చూడటం అన్యాయమని చెప్పారు. అనంతరం పద్మనాభరెడ్డి మాట్లాడారు. వరప్రసాద్‌రావు ఎంపీగా గెలిచిన అనంతరం మండలాల్లో అనేక సార్లు తిరిగి ప్రజా సమస్యలను తెలుసుకొని నిధులను కేటాయిస్తున్నారని కొనియాడారు.

అనంతరం పాపారెడ్డి మనోజ్‌కుమార్‌రెడ్డి కుటుంబసభ్యులను కలిశారు. పార్టీ మండల కన్వీనర్ నేదురుమల్లి ఉదయ్‌శేఖర్‌రెడ్డి, కోట ఎంపీపీ నల్లపరెడ్డి వినోద్‌కుమార్‌రెడ్డి, నేదురుమల్లి శ్రీధర్‌రెడ్డి, కోట ఎంపీటీసీ దారా సురేష్, నాయకులు దుష్యంతయ్య శెట్టి, తుమ్మల మోహన్‌నాయుడు, ఎస్సీ సెల్ అధ్యక్షులు అడపాల ఏడుకొండలు, సుధాకర్‌రెడ్డి, గాది భాస్కర్, కుంబాల మస్తానయ్య, తదితరులు పాల్గొన్నారు.