2018లోనే సార్వత్రిక ఎన్నికలు..?
చిత్తూరుః 2018లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయని, అందుకు తగ్గట్టుగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధం కావాలని ఎంపీ మిథున్రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పెద్ద తిప్పసముద్రం, తంబళ్లపల్లెలో నవరత్నాల సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోడీ ఒకే దేశం-ఒకే ఎన్నిక అనే నినాదం తీసుకు వస్తున్నారన్నారు. నంద్యాలలో వైయస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యలను కొన్ని పత్రికలు వక్రీకరిస్తే సీఎం సహా మంత్రులు, టీడీపీ నాయకులు రాద్ధాంతం చేశారన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలను ప్రస్తావిస్తున్న జననేత ప్రశ్నలకు సమాధానం ఇవ్వని చంద్రబాబు, వైయస్ జగన్ చేసిన వ్యాఖ్యలను పదే పదే ప్రస్తావిస్తూ సమస్యను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. నంద్యాల ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడి అడ్డదారిలో టీడీపీ విజయం సాధించిందన్నారు. జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కృసి చేయాలని సూచించారు.