ఇంతకంటే దిగజారుడుతనం ఇంకొకటి ఉండదు
వైయస్ఆర్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి
తూర్పుగోదావరి: భారతదేశంలో మొట్టమొదటి సారిగా సాగునీటి ప్రాజెక్టులను బ్యాంక్లకు తాకట్టుపెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని వైయస్ఆర్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి గడిచిన నాలుగేళ్లలో రైతులకు చేసిందేమీ లేదన్నారు. కోఆపరేటివ్ డెయిరీలను చంద్రబాబు తన సొంత సంస్థ హెరిటేజ్ కోసం బ్యాన్ చేయించారని మండిపడ్డారు. ప్రజా సంకల్పయాత్రలో పాల్గొన్న నాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఒక రైతు సంఘం నాయకుడిగా పేరు తెచ్చుకుంటున్న వైయస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారన్నారు. ప్రజా సంకల్పయాత్ర మొదట్లో రైతుల కష్టాలను వైయస్ జగన్కు తాను వివరించే వాడినని, కానీ ఇప్పుడు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వైయస్ జగన్ తనకు క్షుణ్ణంగా వివరిస్తున్నారన్నారు. అంటే ప్రజా సంకల్పయాత్రలో ప్రజల కష్టాలను ఏ విధంగా తెలుసుకున్నారో అర్థం అవుతుందన్నారు. గతంలో దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి కూడా ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకొని అధికారం చేపట్టి సువర్ణ పాలన అందించారన్నారు. అలాంటి పాలన మళ్లీ వైయస్ జగన్ అందిస్తారన్నారు.