వీరాంజనేయునికి మాజీ మంత్రి మోపిదేవి పూజలు
పొన్నూరు(చేబ్రోలు)ః పట్టణంలోని శ్రీ సహస్రలింగేశ్వరస్వామివారి దేవస్ధాన ప్రాంగణంలో వేంచేసియున్న శ్రీ వీరాంజనేయస్వామి వారికి మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త మోపిదేవి వెంకటరమణారావు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన వారం మంగళవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. మంగళవారం రోజున స్వామివారిని దర్శించుకుంటే మనసులోని కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. ఆ విశ్వాసం వల్లే మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు, ఆయన తనయుడు మోపిదేవి రాజీవ్లు పూజలు నిర్వహించారు. అర్చకులు అష్టోత్తర పూజ, సహస్రనామార్చనలు నిర్వహించారు. కార్యనిర్వహణాధికారి యార్లగడ్డ రాధాకృష్ణ స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు. అనంతరం జగన్నాథస్వామి ఆశ్రమ సేవా సమితి వ్యవస్ధాపక అధ్యక్షురాలు మాతృశ్రీ లక్ష్మీకాంతమ్మ(అమ్మ)వారిని దర్శించుకున్నారు. మంత్రి మోపిదేవి వెంట వైకాపా నాయకుడు కొఠారు వెంకటరమణ, గొడుగు వీరరాఘవరెడ్డి, అక్కినాగరాజు తదితరులున్నారు.