విజయవాడ: ఎమ్మెల్యే రోజాను ప్రభుత్వం కిడ్నాప్ చేసిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి ఆరోపించారు. శనివారం
ఆయన డీజీపీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ..మహిళా సదస్సుకు హాజరయ్యేందుకు వచ్చిన ఎమ్మెల్యే రోజాను ప్రభుత్వం ఎయిర్
పోర్టులో నిర్భందించి, అక్కడి నుంచి ఎక్కడికి తరలించారో ఆచూకీ తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె కిడ్నాప్పై డీజీపీకి ఫిర్యాదు చేస్తున్నట్లు పార్థసారధి తెలిపారు. ఎందుకు ప్రభుత్వం ప్రతిసారి ప్రతిపక్షాన్ని చూసి భయపడుతోందని ఆయన ప్రశ్నించారు. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తరుముకోవాల్సిన అవసరం ఏముందన్నారు. ఏ కార్యక్రమం చేసినా నాయకులందరిని అరెస్టు చేయడం, గృహ నిర్భందం చేయడం, రోడ్డు మీదకు రాకుండా అడ్డుకోవడం ఏంటని నిలదీశారు. అన్నిబ్రహ్మండంగా ఉన్నాయని ప్రజలకు భ్రమ కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వంలో మహిళలపై జరిగిన అరాచకాలను ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎక్కడ బయటపెడుతారోనని భయపడి ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.