దమ్ముంటే సీఎం కిరణ్ రాజీనామా చేయాలి
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డికి దమ్ముంటే తన పదవికి రాజీనామా చేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి సవాల్ చేశారు. అసెంబ్లీని ఇప్పటికిప్పుడు రద్దుచేస్తే రాష్ట్ర విభజన వెంటనే ఆగిపోతుందని ఆయన అన్నారు. సమైక్యవాదం ముసుగులో రాష్ట్ర విభజనకు కిరణ్రెడ్డి సహకరిస్తున్నారని గుర్నాథరెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా లేఖ ఇచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు మాత్రం విభజన వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందంటూ మొసలికన్నీరు కారుస్తున్నారని ఆయన విమర్శించారు.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, గుర్నాథరెడ్డి నేతృత్వంలో అనంతపురంలోని సప్తగిరి సర్కిల్లో సోనియా గాంధీ దిష్టిబొమ్మను తోపుడుబండిపై పెట్టి శవయాత్ర చేసి, అనంతరం దానిని దహనం చేశారు. క్లాక్ టవర్ వద్ద కూడా కొందరు సమైక్యవాదులు నిరసన తెలిపారు. క్లాక్ టవర్పై నల్లజెండాను ఎగరేశారు.