విజయమ్మకు మద్దతుగా ఆళ్ల నాని దీక్ష
సమన్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళ నాని కూడా నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. సీమాంధ్ర ప్రజల తరఫున శ్రీమతి విజయమ్మ చేస్తున్న 'సమర దీక్ష'కు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు జేజేలు పలుకుతున్నారు. ఎమ్మెల్యే ఆళ్ల నాని (కాళీ కృష్ణ శ్రీనివాస్) మంగళవారం ఏలూరులోని ఫైర్ స్టేషన్ సెంటర్లో దీక్ష మొదలుపెట్టారు.
ఆమరణ దీక్ష ప్రారంభించిన సందర్భంగా నాని మాట్లాడుతూ.. మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి బ్రతికి ఉంటే రాష్ట్రానికి ప్రస్తుత దుస్థితి దాపురించేది కాదన్నారు. శ్రీమతి విజయమ్మ సమర దీక్ష చరిత్రాత్మకమన్నారు. చంద్రబాబు నాయుడు వైఖరి వల్లే రాష్ట్రానికి ఇలాంటి దుర్భర పరిస్థితి వచ్చిందని నాని మండిపడ్డారు. చంద్రబాబాబు నాయుడు బస్సుయాత్ర చేపడితే సీమాంధ్ర ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు ఇప్పటికైనా రాజీనామా చేసి ప్రజా ఉద్యమంలో పాల్గొనాలని నాని డిమాండ్ చేశారు.