ఓటమి భయంతోనే టీడీపీ అధికార దుర్వినియోగం

17 Aug, 2017 17:50 IST

రాయచోటి రూరల్‌ : నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ నాయకులు, సీఎం చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని వైయస్‌ జగన్‌ యూత్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు చంద్రశేఖర్‌ రెడ్డి అన్నారు. గురువారం రాయచోటిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు . టీడీపీ అధికార దుర్వినియోగం, విధ్వంసాలకు పాల్పడినా వైయస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పామోహన్‌ రెడ్డి విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు మూడేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్‌కు ఏమి చేశారో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. నంద్యాల వైయస్సార్‌సీపీ నాయకులపై దాడులకు పాల్పడుతూ ఓటర్లను ఎన్నో రకాలుగా ప్రలోభపెట్టి రహదారుల విస్తరణ పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తున్నా నంద్యాల ప్రజలు భయపడకుండా రాజన్న పాలన కోసం పాటుపడుతున్నారని చెప్పారు. చంద్రబాబు పతనానికి నంద్యాల ప్రజలు నాంది పలకాలని ఆయన పిలుపునిచ్చారు.