'మరో ప్రజాప్రస్థానంలో ఆడంబరాలు వద్దు'

22 Nov, 2012 14:26 IST
మహబూబ్‌నగర్‌, 22 నవంబర్‌ 2012: మరో ప్రజాప్రస్థానం పాదయాత్రగా నడిచి వస్తున్న షర్మిలపై పువ్వుల చల్లడం, రోడ్లపై పరచడంలాంటి ఆడంబరాలకు దూరంగా ఉండాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మహబూబ్‌నగర్‌ జిల్లా వాసులకు విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా విగ్రహాలు, పతాకాలను ఆవిష్కరించాలని, కార్యాలయాలకు ప్రారంభోత్సవం చేయాలని, ప్రార్థనా మందిరాలకు రావాలని ఆహ్వానించడం లాంటి కార్యక్రమాలు పెట్టవద్దని పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, జిల్లా సమన్వయ కమిటీ సభ్యుడు కె.కె. మహేందర్‌రెడ్డి పాలమూరు జిల్లా వాసులు, అభిమానులు, పార్టీ శ్రేణులకు సూచించారు. పాదయాత్ర సందర్భంగా ప్రజలు తమ సమస్యలను షర్మిలకు చెప్పుకోవాలని ఆయన కోరారు. వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధ్యక్షుడు వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర నేటి నుండి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కొనసాగుతుంది.