- ఘన నివాళికి రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్సీపీ ఏర్పాట్లు
- రక్తదానం, అన్నదానం, ఉచిత వైద్య శిబిరాలు
- ఇడుపులపాయలో వైఎస్ఆర్ సమాధి వద్ద
- శ్రద్ధాంజలి ఘటించనున్న విజయమ్మ
హైదరాబాద్, 2 సెప్టెంబర్ 2012 : మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైయస్రాజశేఖరరెడ్డి మూడవ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించడానికి ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలు కార్యక్రమాలను చేపడుతోంది. రక్తదానం, అన్నదానంతో పాటు ఉచిత వైద్య శిబిరాలు పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. వీటితో పాటు ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు, ఆహారం పంపిణీ వంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతున్నారు. ఆదివారం ఉదయం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఇడుపులపాయలోని మహానేత సమాధి వద్ద ప్రార్థనలు జరిపి, శ్ర ద్ధాంజలి ఘటిస్తారు. ఈ కార్యక్రమంలో వైయస్ కుటుంబ సభ్యులందరూ పాల్గొంటారు.
హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 9.30 గంటలకు వైయస్కు శ్రద్ధాంజలి ఘటిస్తారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవాదళం ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ శిబిరంలో 2,000 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేస్తారు. పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. ఇవి కాకుండా గ్రామస్థాయి నుంచి జిల్లా కేంద్రాల వరకూ వైయస్ సంస్మరణ కార్యక్రమాలు జరగనున్నాయి. వైయస్ మరణించిన నల్లకాలువ వద్ద కూడా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అక్కడ పేద మహిళలకు చీరల పంపిణీ చేయడంతో పాటుగా కొవ్వొత్తులు వెలిగించి మహానేతకు నివాళులర్పిస్తారు.