గోపాల్ రెడ్డిని గెలిపించుకుందాం

18 Oct, 2016 11:16 IST
అనంతపురం : పశ్చిమ రాయలసీమ పట్టభధ్రుల నియోజకవర్గానికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో బరిలో నిలుస్తున్న వెన్నపూస గోపాల్‌రెడ్డిని గెలిపించుకుందామని మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షులు రంగంపేట గోపాల్‌రెడ్డి అధ్యక్షతన అనంతపురం అర్బన్‌ నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గురునాథరెడ్డి మాట్లాడుతూ... అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలనూ మోసగించిందన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని లేదంటే భృతి ఇస్తామంటూ నిరుద్యోగులను నిలువునా మోసం చేసిన చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో నిరుద్యోగులు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.  నగరంలో అన్ని డివిజన్లలోనూ పట్టభధ్రులను గుర్తించి ఓటరుగా నమోదు చేయించాలని కన్వీనర్లకు సూచించారు. 

మాజీ మేయర్‌ రాగే పరుశురాం మాట్లాడుతూ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కార్యక్తలకు పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా గోపాల్‌రెడ్డిని గెలిపించి పార్టీ అధినేత వైయస్‌ జగన్‌కు కానుకగా ఇద్దామన్నారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ధనుంజయయాదవ్‌ మాట్లాడుతూ  నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న చంద్రబాబుకు  ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగినశాస్తి జరుగుతుందన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి  మాట్లాడుతూ అబద్ధాల చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. రాష్ట్రంలో విద్యా, వైద్య రంగాలు భ్రష్టు పట్టాయన్నారు. ఇంటికో ఉద్యోగం అంటూ నిరుద్యోగులను మోసం చేశారన్నారు. అందరి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి  గౌస్‌బేగ్, ప్రతాప్‌రెడ్డి, నాయకులు యూపీ నాగిరెడ్డి, వెంకటరామిరెడ్డి, కొ్రరపాడు హుసేన్‌పీరా, కార్పొరేటర్‌ సరోజమ్మ, విద్యార్థి విభాగం బండి పరుశురాం తదితరులు పాల్గొన్నారు.